బంజారాహిల్స్, డిసెంబర్ 25: అనారోగ్యంతో బాధపడుతూ మృత్యువుతో పోరాడుతున్న తండ్రిని కడసారి చూసేందుకు కొడుకు వచ్చాడు. రెండు రోజుల్లో తండ్రితోపాటు కొడుకూ మృతి చెందాడు. ఈ విషాద ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. ముంబైకి చెందిన డీ హరూన్ రషీద్ (70) నాలుగునెలల క్రితం హైదరాబాద్ వచ్చి బంజారాహిల్స్లో పేయింగ్ గెస్ట్గా ఉంటున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న రషీద్ ఈ నెల 21న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ముంబైలో కారు డ్రైవర్గా పనిచేస్తున్న తన కొడుకు అబ్దుల్ సలాం (48)కు ఫోన్ చేసి.. తన పరిస్థితి బాగాలేదని, కడసారి చూసేందుకు రావాలని కోరారు.
ఈ నెల 22న అబ్దుల్ సలాం నగరానికి వచ్చారు. ఆరోగ్యం విషమించడంతో మరుసటిరోజే రషీద్ చనిపోయారు. తండ్రి అంత్యక్రియలు పూర్తిచేసిన అబ్దుల్ సలాం మరుసటి రోజు ఉదయం ముంబైకి వెళ్లాలని భావించారు. అర్ధరాత్రి దాటాక సలాంకు తీవ్ర కడుపునొప్పి రావడంతో ఇంటి యజమాని అతడిని ఉస్మానియా దవాఖానలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. రెండురోజుల వ్యవధిలో తండ్రీ కొడుకు ఇద్దరూ మృత్యువాత పడటంతో స్థానికంగా విషాదం నెలకొన్నది. ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.