Dial 100 | సిటీబ్యూరో, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): డయల్ 100కు కాల్ చేస్తే.. 5 నుంచి 8 నిమిషాల వ్యవధిలోనే ఘటనా స్థలికి చేరుకొనే పోలీసులు.. నేడు గంటలు, రోజులైనా.. చేరుకోలేని పరిస్థితి ఉన్నదన్న విమర్శలు వస్తున్నాయి. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఈ పరిస్థితి మరింత అధ్వానంగా ఉన్నది. పోలీసు సేవలు ప్రజలకు వేగంగా అందించేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం డయల్ 100 సేవలను వేగవంతం చేసింది. (అత్యవసర సేవలకు జాతీయ స్థాయిలో 112 అందుబాటులోకి తేగా.. డయల్ 100కు కాల్ చేసినా.. అదే నంబర్కు వెళ్తుంది). బాధితులు డయల్ 100కు ఫోన్ చేయగానే.. అక్కడి నుంచి నేరుగా పోలీస్స్టేషన్లోని ఆయా సెక్టార్లలో ఉండే పెట్రోలింగ్ సిబ్బందికి ఆ సమాచారం వెళ్లడం..వెంటనే ఆ పెట్రోలింగ్ సిబ్బంది అక్కడకు చేరుకునే పటిష్టమైన వ్యవస్థను రూపొందించారు. ఒక కాల్ వచ్చిందంటే.. ఎంత సేపట్లో పెట్రోలింగ్ సిబ్బంది ఘటనాస్థలికి వెళ్లారనే పర్యవేక్షణ కొనసాగేది. ఆ సమస్య పరిష్కారమైందంటూ.. తిరిగి బాధితులకు కూడా సమాచారం ఇచ్చే వాళ్లు. ఇలా వేగవంతంగా, కచ్చితమైన సమయంలో డయల్ 100 సేవలు కొనసాగుతూ వచ్చాయి. అయితే నేడు పరిస్థితి పూర్తిగా మారింది. 10 నిమిషాల్లోపు రావడం అనేది ఇప్పుడు అసాధ్యంగా మారింది. గంటల కాదు ఏకంగా కొన్ని సందర్భాల్లో రోజుల సమయం కూడా తీసుకుంటున్నారంటే.. సిబ్బంది ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థమవుతున్నది.
సరూర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో 9వ తేదీ రాత్రి 11.30 గంటల ప్రాంతంలో డయల్ 100కు కొందరు ఫోన్ చేశారు. కర్మన్ఘాట్లో సౌండ్ పొల్యూషన్ వస్తున్నదని, పక్కన పెద్ద పెద్ద శబ్ధాలతో శ్లాబ్లు వేస్తున్నారని, మేం నిద్రలేకుండా ఉన్నామం’టూ.. డయల్ 100కు ఫోన్ చేసి బాధలు చెప్పారు. ఫోన్ చేసిన వారికి మీరు డయల్ డయల్ 112(100) కాల్ చేశారు.. మీ సమస్యను సరూర్నగర్ పోలీస్స్టేషన్కు కేటాయించాం.. సంబంధిత అధికారి మిమ్మల్ని కాంటాక్టు చేస్తారంటూ..సందేశం కూడా వచ్చింది. గంటకు కూడా ఎవరి నుంచి ఫోన్ రాకపోడంతో మరోసారి ఫోన్ చేశారు. ఒక్కొక్కరూ రెండు మూడు సార్లు ఫోన్ చేసినా.. సంబంధం లేదన్నారు. దీంతో ఇంటర్నెట్లో స్థానిక మొబైల్ నంబర్కు, పోలీస్స్టేషన్కు ఫోన్ చేశారు. వేరే కేసులో ఉన్నామంటూ చెప్పారు. అయితే మరో గంట తరువాత కూడా ఎవరూ అక్కడకు రాలేదు. తీరా డయల్ 100కు ఫోన్లు కొడుతుండడంతో చివరకు రాత్రి 1.30 గంటలకు పెట్రోలింగ్ పోలీసులు ఫోన్ చేసి వచ్చారు.భవన నిర్మాణ పనులు నడుస్తుండడంతో పెట్రోలింగ్ సిబ్బంది వచ్చి..వాటిని ఆపేయాలని శబ్ధం వస్తుందంటూ వారికి సూచన చేసి, ఫిర్యాదు చేసిన వారిని పంపించేశారు. తరువాత మళ్లీ అక్కడ శబ్ధ కాలుష్యం కొనసాగింది. అయితే పోలీసులకు ఫోన్ చేయడం వృథా అనుకొని తరువాత పోలీసులను ఎవరూ సంప్రదించలేదు.
ఈ నెల 7న రాత్రి మీర్పేట్ పోలీస్స్టేషన్ పరిధిలోని సప్తగిరి కాలనీలో ఒక ఇంట్లో దొంగతనం జరిగింది. రాత్రి 9 గంటల ప్రాంతంలో డయల్ 100కు బాధితులు ఫోన్ చేసి దొంగతనం జరిగిందంటూ చెప్పారు. ఫోన్ చేసిన తరువాత గంటలు గడుస్తున్నా ఎవరూ రాలేదు. కొన్ని గంటల తరువాత పోలీసులు ఫోన్ చేశారు. మేం వస్తున్నామంటూ చెప్పారు. అయితే 9వ తేదీ ఉదయం 11 గంటల ప్రాంతంలో ఘటనా స్థలానికి వెళ్లారు. అయితే 7 వ తేదీ రాత్రి డయల్ 100కు ఫోన్ చేసిన వారి ఇంట్లో వి ద్యుత్ సామగ్రి దొంగతనం కాగా, అదే ప్రాంతంలో మరో ఇంట్లో ల్యాప్టాప్ల చోరీ జరిగింది. పోలీసులు ఆ సమయంలో ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ చేసి.. ఉంటే రెండో దొంగతనం జరిగేది కాదని స్థానికులు వాపోతున్నారు.
దొంగతనాలు జరుగుతున్నాయని కాలనీలో అనుమానాస్పద వ్యక్తులు కొత్తవాళ్లు తిరుగుతున్నారంటూ.. మారుతీనగర్కు చెందిన ఒక కాలనీ ప్రతినిధి డయల్ 100కు 10వ తేదీ రాత్రి 8 గంటల ప్రాంతంలో సమాచారం ఇచ్చాడు. అయితే మరుసటి రోజు వరకు కూడా అక్కడికి పోలీసులు వెళ్లలేదు. కనీసం ఫోన్ చేసి ఏమి జరిగిందని అడిగిన వాళ్లు లేరు.
డయల్ 100కు ఫోన్ చేయడంతో వెంటనే పోలీసులు వస్తారనే భరోసా ప్రజల్లో ఉన్నది. అయితే స్థానికంగా ఉండే పెట్రోలింగ్, క్షేత్ర స్థాయి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఇలా జాప్యం జరుగుతున్నదని కొందరు అధికారులు పేర్కొంటున్నారు. వేరే పనిలో ఉండి.. డయల్ 100కు ఆలస్యంగా రావడం అనేది పది ఇరవై నిమిషాలుంటుంది. అలా కాకుండా గంటలు, రోజులు మాత్రం గతంలో ఎప్పుడు లేవు. ప్రతి కాల్కు స్పందన, రెస్పాన్స్ సమయం కచ్చితంగా నిర్వహించేవారు. కొన్ని సందర్భాల్లో స్థానికంగా ఉండే పెట్రోలింగ్ సిబ్బందికి ఆయా వ్యాపార కేంద్రాల నిర్వాహకులతో సంబంధాలుంటాయి. ఆ ప్రాంతం నుంచి ఎవరైనా ఫిర్యాదు చేశారంటే కూడా పట్టించుకోరు. మరికొన్ని సందర్భాల్లో సమస్యను పరిష్కరించినట్లే చేస్తూ, ఆ తరువాత ఆరోపణలు ఎదుర్కొనే వారితో కొంత డబ్బు తీసుకొని తూతూ మంత్రంగా సమస్య పరిష్కరించినట్లు చేసి.. అక్కడి నుంచి వెళ్లిపోతుంటారు. ఇలా కొందరు ఉద్దేశపూర్వకంగా కూడా డయల్ 100 సేవల్లో కాలాయపన చేస్తుంటారని కొందరు అధికారులు పేర్కొంటున్నారు.