Osmania University | సిటీబ్యూరో, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ) : ఉస్మానియా యూనివర్సిటీలో కరెంటు బిల్లులు తగ్గించుకునే ప్రయత్నంలో అధికారులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. త్వరలో ఓయూ క్యాంపస్లో ఉన్న ఏ హాస్టల్, బీ హాస్టల్ పునరాభివృద్ధిలో భాగంగా ఆయా భవనాలపై సోలార్తో రూఫ్ ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించారు. సంబంధిత విభాగాలతో సాధ్యాసాధ్యాలపై చర్చిస్తున్నారు. హాస్టళ్ల నిర్వహణలో భాగంగా కరెంటు బిల్లును బాగా తగ్గించుకునే ప్రయత్నంలోనే సోలార్ రూఫింగ్ విధానం గురించి ఆలోచన చేశామని, ప్రస్తుతం దీనికి సంబంధించి టెండర్ ప్రక్రియ కొనసాగుతున్నట్లు ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్యాదవ్ తెలిపారు. పైగా నిర్వహణ ఖర్చులు కూడా బాగా తగ్గుతాయన్నారు.
ప్రస్తుతం వర్సిటీలో మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. అందులో భాగంగా కొత్త హాస్టల్స్ నిర్మాణాలు, పరిపాలనా భవనం వంటి వాటితో పాటు శిథిలావస్థకు చేరుకున్న రెండు హాస్టళ్లకు మరమ్మతు పనులు కూడా చేపడుతున్నారు. ఈ రెండు హాస్టళ్లను ఆధునిక హంగులతో అభివృద్ధి చేయబోతున్నామన్నారు. ఒక్కొక్క హాస్టల్ దాదాపు 800 పైగా విద్యార్థులు ఉండే విధంగా వీటిని పునరాభివృద్ధి చేయనున్నట్లు వీసీ తెలిపారు.