సాఫ్ట్వేర్ ఉద్యోగి దారుణ హత్య
భార్య బంధువుల ఘాతుకం
విషాదాంతమైన ప్రేమ వివాహం
కేపీహెచ్బీ కాలనీ, జూలై 3: ఒకే ఊరు.. ఒకే కులం.. చిన్ననాటి నుంచి ప్రేమించుకున్నారు. కులం ఒక్కటైనా.. అంతస్తుల పట్టింపులు రావడంతో అమ్మాయి తల్లిదండ్రులు నిరాకరించారు. దీంతో ప్రేమికులిద్దరూ పెద్దలను ఎదురించి..పెండ్లి చేసుకున్నారు. పగతో రగిలిపోయిన అమ్మాయి బంధువులు ఆ యువకుడిని హతమార్చి..నిప్పంటించారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ దారుణ ఘటనకు సంబంధించి.. కేపీహెచ్బీకాలనీ పోలీసులు, మృతుడి బంధువుల కథనం ప్రకారం.. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం పెద్దలకొండపల్లికి చెందిన శనివారపు వెంకటనారాయణరెడ్డి (25) సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన వెంకటేశ్వర్రెడ్డి కూతురు రవళిని ప్రేమించి.. ఏడాది కిందట ఇంట్లోంచి పారిపోయి పెండ్లి చేసుకున్నాడు.
యువతి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, అబ్బాయిని పోలీస్స్టేషన్కు పిలిపించి.. మాట్లాడే క్రమంలో అమ్మాయిని ఆమె కుటుంబసభ్యులు ఇంటికి తీసుకెళ్లారు. కాగా, వెంకటనారాయణరెడ్డి కొత్త ఉద్యో గం అన్వేషణలో భాగంగా కేపీహెచ్బీ కాలనీ మొదటి రోడ్డు ఎంఐజీ 39లో మరో ఇద్దరు స్నేహితులతో కలిసి అద్దె గదిలో నివసిస్తున్నాడు. ఎల్బీనగర్లో ఉంటున్న అమ్మాయి వాళ్ల పెద్దనాన్న కుమారుడు శ్రీనివాస్రెడ్డి (20) ఈనెల 28న వెంకటనారాయణరెడ్డితో ఉన్న పరిచయంతో ఫోన్లో మాట్లాడి కారులో ఎక్కించుకుని బయటికి తీసుకెళ్లాడు. శ్రీనివాస్ రెడ్డితో పాటు కాశీ (20), ఆశిక్ (20) లు కలిసి కారులో తీసుకెళ్లి.. మద్యం తాగారు. ముందస్తు ప్లాన్ ప్రకారం కారులోనే వెంకటనారాయణరెడ్డిని గొంతు నులిమి హత్య చేశారు. జిన్నారం గ్రామ పంచాయతీ పరిధిలోని పుట్టగూడు శివారు బ్రిడ్జి వద్ద ఉన్న అడవిలోకి శవాన్ని తీసుకెళ్లి పెట్రోల్పోసి నిప్పు పెట్టారు.
స్విచ్ఛాఫ్ రావడంతో..
జూన్ 28 నుంచి వెంకటనారాయణరెడ్డి ఫోన్ స్విచ్ఛాఫ్ కావడం.. తోటి స్నేహితులను విచారించినా ఆచూకీ లేకపోవడంతో అతడి బావ వెంకటేశ్వర్లు కేపీహెచ్బీకాలనీ పోలీస్స్టేషన్లో జూన్ 30న ఫిర్యాదు చేశాడు. వెంకటనారాయణరెడ్డిని బయటికి తీసుకెళ్లిన శ్రీనివాస్రెడ్డి ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేసి ఉండడంతో అతడితో మాట్లాడిన వారి ఫోన్ నంబర్ల ఆధారంగా దర్యాప్తు చేట్టారు. ఆశిక్ను అదుపులోకి తీసుకోగా, వెంకటనారాయణరెడ్డిని హత్యచేసి దహనం చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. అమ్మాయి తండ్రి వెంకటేశ్వర్రెడ్డి సూచనలతోనే శ్రీనివాస్రెడ్డి అతడి స్నేహితులు కలిసి వెంకటనారాయణరెడ్డిని హత్య చేసినట్లు ప్రాథమికంగా గుర్తించి వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.