సిటీబ్యూరో, జూలై 10(నమస్తే తెలంగాణ): సోషల్ మీడియా వేదికగా తక్కువ ధరకు వాహనాలను విక్రయిస్తామని, నగ్న వీడియోల ద్వారా బ్లాక్ మెయిల్కు పాల్పడుతున్న రాజస్థాన్ అళ్వార్ గ్రామానికి చెందిన ఎనిమిది మందిని శనివారం సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల ప్రకారం, మార్చి 3న నగరానికి చెందిన డి.శ్రీనివాస్ మంచం విక్రయిస్తున్నట్లు ఓఎల్ఎక్స్లో ప్రకటన పెట్టాడు. ప్రకటనను చూసి మంచం కొనుగోలుకు సంప్రదించిన గుర్తు తెలియని వ్యక్తి శ్రీనివాస్కు క్యూఆర్ కోడ్ను పంపించి అతని బ్యాంక్ ఖాతా, యూపీఐ ఖాతా పిన్ నెంబరు తెలుసుకుని రూ.90 వేలను కాజేశారు. దీనిపై శ్రీనివాస్ సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా సైబరాబాద్ పోలీసులు ఫోన్ నెంబరుతో పాటు, నగదు బదిలీయైన బ్యాంక్ వివరాల ఆధారాలు సేకరించి రాజస్థాన్ అళ్వార్ పోలీసులకు సమాచారం అందించారు. వారు ఈ ఆధారాలతో మోసానికి పాల్పడిన కసమ్ సింగ్, బాబ్లీ ఖాన్, సమయాదీన్, ఫారూక్, సైకుల్ ఖాన్, సాహీల్ ఖాన్, రాహుల్, అర్సాద్లను జూన్ 20న అరెస్టు చేశారు. ఎనిమిది మందిని నగరానికి తీసుకువచ్చి శనివారం రిమాండ్కు తరలించారు. ఈ ముఠాలో ప్రధాన సూత్రధారి డిగ్రీ చదువుకోగా, మిగతా వారంతా 8వ తరగతి దాటలేదు.
ఈ ముఠా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో మొత్తం 43 మంది అమాయకులను మోసం చేసి దాదాపు 25 లక్షలు కాజేసినట్లు తెలిసింది. ఈ ముఠా ఆర్మీ, సీఐఎస్ఎఫ్, పోలీసు అధికారులుగా ఫొటోలు పెట్టి ఓఎల్ఎక్స్, ఇన్స్టా గ్రాం, ఫేస్బుక్, ఇతర సోషల్ మీడియా వేదికగా వాహనాలు, ఇతర ఖరీదైన వస్తువులను తక్కువ ధరకు విక్రయిస్తామని ప్రకటనలు పెడతారు. వాటికి స్పందించిన వారిని మాటల్లో పెట్టి క్యూఆర్ కోడ్ ద్వారా యూపీఐ, బ్యాంక్ ఖాతా పిన్ నెంబర్లను దోచేసి అమాయకుల ఖాతాలను కొల్లగొడతారు.
ఈ ముఠా నగ్న వీడియోలు ఉన్నాయంటూ బ్లాక్ మెయిల్కు దిగి బలవంతపు వసూళ్లకు కూడా పాల్పడినట్లు విచారణలో తెలిసింది. ప్రధానంగా డాక్టర్లు, ప్రభుత్వ అధికారులు, కార్పొరేట్ ఉన్నత స్థాయి ఉద్యోగులను టార్గెట్ చేస్తారు. దీని కోసం ఫేస్బుక్ నుంచి వారి వివరాలను సేకరించి వారితో ఫోన్లో అమ్మాయిలుగా మాట్లాడుతారు. చాటింగ్ కూడా చేస్తారు. ఆ తర్వాత వీడియో కాల్ చేసి వారు మాట్లాడుతున్న వైపు చీకటిగా పెట్టుకుని బాధితుడు మాట్లాడే వైపు వెలుతురు ఉండేలా చేసి ఆ మొత్తాన్ని రికార్డు చేస్తారు. ఆ రికార్డింగ్ వీడియో కాల్ను పంపి బ్లాక్ మెయిల్కు దిగుతారు. ఇలా చాలా మంది ప్రొఫెషనల్స్ వీరి బారిన పడి డబ్బులు చెల్లించుకున్నట్లు పోలీసులు గుర్తించారు.