సిటీబ్యూరో, అక్టోబరు 17 (నమస్తే తెలంగాణ) : విజన్ ఉండాలె కానీ ఎంతటి విపత్తునైనా సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపట్టిన ఎస్ఎన్డీపీ ప్రాజెక్టు అక్షరాల నిరూపించింది. 2020 అక్టోబరు నెలలో కురిసిన కుండపోత వర్షానికి గ్రేటర్ విలవిలలాడింది. దాదాపు 40వేల కుటుంబాలు అల్లాడిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా భవిష్యత్తులోనూ కుండపోత వర్షాలు కురిసిన ప్రజలకు వరద నీటి ప్రభావం లేకుండా ఉండేందుకుగానూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. వ్యూహాత్మక నాలా అభివృద్ధి పథకానికి (ఎస్ఎన్డీపీ) శ్రీకారం చుట్టి తొలివిడుతగా రూ.985.45కోట్లతో 29 ప్రాంతాల్లో నాలా అభివృద్ధి చేపట్టి 175 కాలనీలకు వరద ముంపును తప్పించింది. తద్వారా దాదాపు నాలుగు లక్షల మంది ప్రజలు వరద సమస్య నుంచి విముక్తి పొందారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్ఎన్డీపీని హెచ్ సిటీ ప్రాజెక్టుగా పేరు మార్చి రెండో దశ కింద 57.401 కిలోమీటర్లలో రూ.667.28కోట్లతో చేపడుతామని ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో పనులు పట్టాలెక్కలేదు..గడిచిన 22 నెలలుగా తొలి విడుతలో పురోగతి పనులను కానీ, రెండో దశ పనుల్లో ఏ ఒక్కటి కూడా పూర్తి చేయకపోవడం అధికారుల పనితీరుకు నిదర్శనం. ఫలితంగా వర్షం వస్తే గ్రేటర్ జనం వణికిపోతున్న పరిస్థితి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ నిద్రలేని రాత్రులను గడుపుతున్న పరిస్థితి నెలకొంది.
ఈ ఏడాది వర్షాకాల సమస్యలపై ప్రజలు తిరుగుబావుటా ఎగురవేశారు. నాలా సమస్యపై ఇంతకాలం ట్విట్టర్, జీహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నంబర్ వేదికగా గళం విప్పిన స్థానికులు వరద ముంపును పర్యటించేందుకు క్షేత్రస్థాయిలోకి వెళ్లిన ప్రజాప్రతినిధులను అడుగడుగునా నిలదీశారు. గతేడాది వర్షాకాలంలో వరద ముంపుతో నానా ఇబ్బందులు పడితే ..ఎస్ఎన్డీపీ (నాలా అభివృద్ధి) పనులను త్వరగా పూర్తి చేసి శాశ్వత పరిష్కారం చూపుతామంటూ చెప్పి వెళ్లిపోయి.. మళ్లీ ఏడాది తర్వాత సమస్యను పరిష్కరిస్తామంటూ ముందుకు వస్తున్న నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యాకత్పురా ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ను నిలదీసి ప్రశ్నల వర్షం కురిపించారు. కొన్ని రోజుల పాటు తమ బస్తీల్లో గడిపితే నరకం ఏంటో మీకే తెలుస్తుందంటూ ఎమ్మెల్యేపై మండిపడ్డారు. సదరు ఎమ్మెల్యేను ఘెరావ్ చేశారు. వర్షాకాల సమస్యల నియంత్రణలో ప్రభుత్వం విఫలం చెందిందని మండిపడ్డారు.
గ్రేటర్లో నాలా అభివృద్ధి పనులపై కాంగ్రెస్ సర్కార్ శీతకన్ను వేసింది.22 నెలలుగా పురోగతిలో ఉన్న ఎస్ఎన్డీపీ మొదటి దశ ప్రాజెక్టు పనులను పూర్తి చేయడంలో నిర్లక్ష్యంవహిస్తున్నది. పురోగతిలో ఉన్న 10 చోట్ల పనులను పూర్తి చేయలేక చేతులేత్తేసింది. ఫలితంగా నేటికీ ఎస్ఎన్డీపీ పనులు మూడు అడుగులు ముందుకు-ఆరు అడుగులు వెనక్కి అన్న చందంగా మారాయి. చేసిన పనులకు జీహెచ్ఎంసీ బిల్లులు చెల్లించడం లేదని, పెండింగ్ బిల్లులు ఇస్తేనే పనులు చేపడుతామంటూ కొన్ని చోట్ల కాంట్రాక్టర్లు చేతులెత్తేసినట్లు తెలుస్తోంది. పనులను చకచకా పూర్తి చేసేందుకు అనుకూలమైన వేసవిని సద్వినియోగం చేసుకోలేని ఫలితంగానే ఈ ఏడాది వర్షాకాలంలో వరద సమస్యలు అధికమయ్యాయని స్థానికులు ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం 2020 అక్టోబరులో వరుణుడి బీభత్సం తర్వాత వరద నీటికి శాశ్వత చర్య లు చేపట్టాలని భావించిన ఎస్ఎన్డీపీ తొలి విడుత పథకం ద్వారా రూ. 985.45కోట్లతో 58 చోట్ల నాలా అభివృద్ధి పనులకు చేపట్టింది. పనులను ప్రతిష్టాత్మకంగా తీసుకుని రూ.531కోట్లతో 29 ప్రాంతాల్లో వేలాది కాలనీల వరద ముంపు సమస్యకు పరిష్కారం చూపింది. తద్వారా 175 కాలనీలను వరద ముంపు నుంచి శాశ్వత పరిష్కారం చూపింది. 43 కిలోమీటర్ల పనుల పూర్తితో ఐదు లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూర్చింది. నాలా అభివృద్ధి పనుల రెండో దశలో 57.401 కిలోమీటర్లలో రూ.667.28కోట్లతో పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఎస్ఏఎస్సీఐ పథకం కింద రూ.250 కోట్లు మాత్రమే విడుదల చేయగా, మిగిలిన నిధులపై స్పష్టత లేదు. నిధుల విడుదల జాప్యం కారణంగా రెండో దశ పనులు నత్తకు నడకలు నేర్పుతుండడం గమనార్హం.