School Bus | హైదరాబాద్ : సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో ఘోర ప్రమాదం తప్పింది. స్కూల్ విద్యార్థులతో వెళ్తున్న ఓ ప్రయివేటు పాఠశాల బస్సులో ఆకస్మికంగా పొగలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన నిలిపి ఉంచాడు. అనంతరం పిల్లలందరిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
అటుగా వెళ్తున్న వాహనదారులు కూడా బస్సు డ్రైవర్కు సహాయం అందించారు. పిల్లలను బస్సులో నుంచి బయటకు తీసుకొచ్చారు. పిల్లలకు ఎలాంటి హానీ జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఈ సందర్భంగా తిరుమలగిరి ఇన్స్పెక్టర్ నాగరాజు మాట్లాడుతూ.. స్కూల్ బస్సు ఇంజిన్లో నుంచి పొగలు వచ్చినప్పుడు.. బస్సులో 25 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలిపారు. పిల్లలందరూ సురక్షితంగా బయటపడ్డారని, ఎవరికీ ఎలాంటి హానీ కలగలేదన్నారు. డ్రైవర్ కూడా ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. పిల్లలను మరో బస్సులో పాఠశాలకు తరలించినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.