సిటీబ్యూరో: వ్యవస్థలను నిర్వీర్యం చేయడంలో కాంగ్రెస్ సర్కారు ప్రత్యేక దృష్టి పెట్టిందనే అరోపణలు వస్తున్నాయి. సజావుగా సాగుతున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియకు చేసిన ఆపరేషన్ విఫలమవుతున్నది. దీంతో నిమిషాల్లో సాగిపోయే రిజిస్ట్రేషన్లు కూడా స్లాట్ బుకింగ్ లేక ఇబ్బందులను ఎదురవుతున్నాయి. వ్యవస్థ ప్రక్షాళన పేరిట రేవంత్రెడ్డి సర్కారు చేసిన విధానాలు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగానికి శరాఘాతంగా మారుతున్నాయని రియల్ వ్యాపారులు ఆరోపిస్తున్నారు. నగరంలో హైడ్రా కూల్చివేతలు, భూ భారతి మార్పులు తర్వాత రియల్ ఎస్టేట్ రంగంపై కాంగ్రెస్ ప్రయోగించిన స్లాట్ ఆస్త్రం తీవ్ర నష్టం చేస్తున్నది. కేవలం రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు ముందస్తు స్లాట్ బుకింగ్ విధానాన్ని ఆరు నెలల కిందట నుంచి అమలు చేస్తున్నది. పరిమితమైన స్లాట్లతో అమ్మబోతే అడవి… కొనబోతే కొరివి అన్న చందంగా మారింది. అసలే మార్కెట్ లేక విలవిలలాడుతున్న రియల్ ఎస్టేట్ లావాదేవీలపై పరిమితమైన స్లాట్లను అందుబాటులో ఉంచడంతో శివారు ప్రాంతాల్లో వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లోనూ స్లాట్ అవలెబులిటీ లేక రోజుల తరబడి రిజిస్ట్రేషన్లను వాయిదా వేసుకుంటున్నారు.
పరిమితమైన స్లాట్లు..
అవుటర్ రింగు రోడ్డు వరకు విస్తరించి ఉన్న నగరంలో 50కిపైగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. వీటిలో కోర్ సిటీ మినహా శివారుల్లోని అన్ని ఓపెన్ ప్లాట్లకు అత్యధికంగా క్రయవిక్రయాలు జరుగుతాయి. అయితే ఆస్తుల రిజిస్ట్రేషన్కు సర్కారు స్లాట్ బుకింగ్ పేరిట నియంత్రించడంతో ఇబ్బంది పడాల్సి వస్తున్నదని రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్నారు. ప్రాంతాన్నీ బట్టి కొన్ని సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో 40లోపే స్లాట్లు ఉన్నాయని, దీంతో ఉన్న ఫళంగా రిజిస్ట్రేషన్ చేసుకునే వీల్లేకుండా పోయిందంటున్నారు. ఇక విదేశాల నుంచి వచ్చి రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన వారికి ఇదొక తలనొప్పిగా మారిందని మండిపడుతున్నారు. ఒక్కోసారి వారం రోజుల వరకు కూడా స్లాట్లు బుకింగ్ చేసుకునే వీల్లేకుండా పోయిందని, రోజుల తరబడి రిజిస్ట్రేషన్ల కోసం నిరీక్షించేలా చేయడం సరికాదని అభిప్రాయపడుతున్నారు.
అసౌకర్యానికి పరిష్కారమేదీ?
గతంలో మాదిరి రిజిస్ట్రేషన్లు చేసుకునే వెసులుబాటుతోపాటు, స్లాట్ బుకింగ్ విధానాన్ని కూడా అమలు చేయగలిగితే ఈ జాప్యానికి పరిష్కారం దొరుకుతుందని రియల్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వానికి ఆదాయం తీసుకువచ్చే రిజిస్ట్రేషన్లను నియంత్రించడమంటే ఖజానాకు వచ్చే సొమ్ములను అడ్డుకోవడమే అవుతుందన్నారు. కాంగ్రెస్ సర్కారు ఇప్పటివరకు రియల్ ఎస్టేట్ రంగానికి చేసిన నష్టం నుంచి తేరుకునే వీలు కూడా వ్యాపారులకు కల్పించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఎందుకు పరిమితమైన స్లాట్లను అందుబాటులో ఉంచుతున్నారని, అవసరాలకు అనువుగా స్లాట్ బుకింగ్ విధానంలో మార్పులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సర్కారు విధిస్తున్న ఆంక్షలతో క్రయవిక్రయాల్లో సమయం వృథా అవుతున్నదని వ్యాపారులు తెలిపారు. కానీ సర్కారు మాత్రం స్లాట్ విధానాన్ని మాత్రమే ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందని, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులపై ప్రభుత్వానికి అవగాహన లేదని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ పేర్కొంది.

Registration
వారం రోజులు ఆగాలా?
రూ. 40 లక్షలకు కొనుగోలు చేసిన ప్లాట్ను ఇప్పుడు అమ్ముకొనే పరిస్థితి లేదు. మార్కెట్ అమ్మకాలు తగ్గిపోవడంతో కొనుగోలుదారులే దొరకడం కష్టం మారింది. అవసరం ఉందని అమ్ముకుందామని రిజిస్ట్రేషన్ పెట్టుకుంటే కేవలం స్లాట్ కోసం ఆగాల్సి వస్తున్నది. ఫిబ్రవరి 20 నుంచి ప్రయత్నం చేస్తుంటే… మార్చి 5న స్లాట్ దొరికింది. అప్పటిలోగా కొనుగోలుదారుడి మనసు మారి, ఏమైనా ఇబ్బందులు వస్తే ఏంటీ పరిస్థితి. స్లాట్లతో ఎవరికీ ప్రయోజనమనేది ఇప్పటికీ అర్థం కావడం లేదు. స్లాట్ బుకింగ్ విధానం అమల్లో ఉన్నా.. ఇన్స్టాంట్ సేవలు అందించే విధంగా ప్రభుత్వ విధానాలు ఉండాలే తప్ప.. నియంత్రించడం సరికాదు.
-కుమారస్వామి, విద్యానగర్
సర్కారుకు ఆదాయం వద్దా?
కాంగ్రెస్ అధికారంలోకి రావడంతోనే కుదేలైన రియల్ ఎస్టేట్ రంగం ఇప్పటికీ కోలుకునే పరిస్థితిలో లేదు. ఒకటి, ఆర ప్లాట్లను అమ్ముకుని పెరిగిన ఆర్థిక అవసరాలను తీర్చుకునే వీల్లేకుండా సర్కారు వ్యవహారిస్తున్నది. స్లాట్ బుకింగ్ విధానం ద్వారా సర్కారుకు వచ్చే ఆదాయాన్ని నియంత్రించాలని చూస్తుందా? అనే అనుమానం కలుగుతున్నది. వారం, పది రోజులుపాటు రిజిస్ట్రేషన్లు ఆపుకోవాలంటే చాలా ఇబ్బందులు వస్తాయనే కనీస అవగాహన సర్కారు లేకుండా పోయింది. నిజానికి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశమే ఉంటే… సరళతరమైన విధానాలను అమలు చేయాలే గానీ, విస్తృతమైన ప్రయోజనాలకు గండికొట్టాల్సిన అవసరమే లేదు.
– నారగోని ప్రవీణ్, తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్