అంబర్పేట, జూన్ 27: వానకాలంలో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వడం, రోడ్లపై చెట్టుకొమ్మలు విరిగి పడిపోవడం, వాన నీటి ప్రవాహానికి రోడ్లన్నీ కొట్టుకపోవడం, మ్యాన్హోళ్లు పగిలిపోవడంలాంటి సమస్యలు ప్రతి ఏడాది తలెత్తుతుంటాయని అందరికీ తెలిసిందే. భారీ వానలు కురిస్తే బస్తీలు, కాలనీల్లో జనాలకు అత్యవసర సేవలు అవసరపడతాయి. ఈ నేపథ్యంలో వర్షాకాలంలో ఎదురయ్యే విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జీహెచ్ఎంసీ అధికారులు అత్యవసర (మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్)లను సిద్ధం చేశారు. ఇప్పటికే వానలు పడుతున్న నేపథ్యంలో ప్రజలకు సత్వర సేవలందించే దిశగా డివిజన్కు ఒకటి చొప్పున ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు వర్షాలు కురిసినప్పుడు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి సేవలందించడంతో పాటు 24 గంటలు ఎలాంటి సమస్యలు ఉత్పన్నమైనా రంగంలోకి దిగేందుకు సిద్ధంగా ఉంటాయి.
సర్కిల్ పరిధిలో ఆరు బృందాలు…
వర్షాకాలం సీజన్లో జీహెచ్ఎంసీ సర్కిల్ పరిధిలో ఎక్కడ ఏ సమస్యలు వచ్చినా డివిజన్ల వారీగా మాన్సూన్ బృందాలు అప్పటికప్పుడు పరిష్కరిస్తాయని అధికారులు తెలిపారు. అంబర్పేట సర్కిల్ పరిధిలో హిమాయత్నగర్, కాచిగూడ, నల్లకుంట, గోల్నాక, అంబర్పేట, బాగ్అంబర్పేట వంటి ఆరు డివిజన్లు ఉన్నాయి. ప్రతి డివిజన్కు వాహనాన్ని కేటాయించి ఆ వాహనంలో అత్యవసర సామగ్రిని అందుబాటులో ఉంచారు. ఒక్కో వాహనానికి 8 మంది సిబ్బంది, రెండు షిప్టుల చొప్పున 24 గంటల పాటు పనిచేయాల్సి ఉంటుంది. ఒక షిప్టులో నలుగురు చొప్పున వార్డుల వారీగా అత్యవసర సేవలు అందించాల్సి ఉంటుంది. వార్డుకు కేటాయించిన వాహనంలో సెల్లార్లలో, లోతట్టు ప్రాంతాల్లో నీటిని తోడేందుకు పంపుసెట్లు ఉంటాయి. చెట్లకొమ్మలను తొలగించడానికి ట్రీ కటింగ్ మిషన్లు, గడ్డపార, పార, కొడవలి, తట్టా లాంటి పరికరాలు ఉంటాయి. వర్షాలు లేనప్పుటు రోడ్డుపై పడిన గుంతలను పూడ్చేందుకు కాంక్రీట్, డస్ట్ మిశ్రమాన్ని వాహనంలో వెంట ఉంటుంది. జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులకు వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించే దిశగా ఈ బృందాలు రంగంలోకి దిగి ప్రజల సమస్యలను పరిష్కరించడం లేదా తాత్కాలిక విముక్తిని కలిగించేలా పనులు చేస్తారు.
ప్రత్యేక ఫిర్యాదుల కేంద్రం ఏర్పాటు..
వానకాలంలో అత్యవసర బృందాలు 24 గంటలు సేవలందించేందుకు సిద్ధంగా ఉంటాయని జీహెచ్ఎం సీ అధికారులు తెలిపారు. ఆయా బృందాలు నాలాలు, డ్రైనేజీలు పొంగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపడతారని, వర్షాల ధాటికి సమస్యలు ముంచుకొస్తే తగిన చర్యలు చేపడతారని కాలనీలు, బస్తీల్లో ప్రజలకు వర్షాలతో ఇబ్బందులు ఎదురైన వెంటనే స్థానిక ప్రజాప్రతినిధులకు, జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదులు చేయడం జరుగుతుంది. ఈ ఫిర్యాదులను స్వీకరించేందుకు సర్కిల్లో ప్రత్యేక ఫిర్యాదుల కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలు ఫిర్యాదులు అందిన వెంటనే వార్డుకు సంబంధించిన అధికారుల పర్యవేక్షణలో అత్యవసర బృందాలు వెంటనే రంగంలోకి దిగుతాయి. అక్టోబర్ 31 వరకు ఈ బృందాలు అందుబాటులో ఉండి అత్యవసర సేవలు అందిస్తాయని అధికారులు వెల్లడించారు.