Crime News | వెంగళరావునగర్, ఏప్రిల్ 1: కన్నోళ్లు కాలం చేశారు.. ఆర్థిక ఇబ్బందులు వెంటాడాయి. బతుకు భారంగా మారడంతో.. అక్కా, తమ్ముడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. సూసైట్ నోట్ లభించడంతో.. ఆత్మహత్యగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటన మధురానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై బాల్రాజ్ కథనం ప్రకారం.. రహ్మత్నగర్ డివిజన్ సంతోష్గిరి బస్తీలో నివాసముంటున్న రాజశ్రీ(30), సాయికుమార్ (28) అక్కా.. తమ్ముడు. వీరి తల్లిదండ్రులు మరణించాడు. రాజశ్రీకి తొమ్మిదేండ్ల కిందట అదే ప్రాంతానికి చెందిన నర్సింగరావుతో వివాహమైంది. కాపురంలో కలతలు రావడంతో పుట్టింటి వద్దే ఉంది. ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. ఆమె తమ్ముడు సాయికుమార్ ఓ హోటల్లో పనిచేయగా వచ్చిన డబ్బుతో జీవనం సాగిస్తూ.. ఇద్దరు కల్లుకు అలవాటుపడ్డారు. వీరిద్దరి మానసిక స్థితి కూడా సరిగా లేదు.
చాలాసార్లు ఒంటిపై సరిగా దుస్తులు లేకుండానే ఇంటి బయటకు రావడంతో స్థానికులు వీరికి బట్టలు కొనిచ్చారు. బతుకు భారంగా ఉందంటూ.. తానుపడ్డ కష్టాలను రాజశ్రీ సూసైడ్ నోట్లో రాసింది. సోమవారం వీరి ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు గమనించి, పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఇంటి తలుపుపగులగొట్టి లోనికి వెళ్లి చూడగా.. రాజశ్రీ, సాయికుమార్ మృతదేహాలు కనిపించాయి. మృతదేహాల ఆధారంగా.. రాజశ్రీ ఐదు రోజుల కిందట, సాయికుమార్ రెండు రోజుల కిందట మరణించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా వీరిద్దరు ఎలా మరణించారన్న విషయం తెలుస్తుందని, కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై బాల్రాజ్ తెలిపారు.