Banjarahills | బంజారాహిల్స్, జూన్ 26 : నగరం నడిబొడ్డున ఖరీదైన ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలపై నమస్తే తెలంగాణ పత్రికలో ‘ఖరీదైన ప్రభుత్వ స్థలంపై కబ్జాదారుల కన్ను’ పేరుతో గురువారం ప్రచురించిన కథనంపై షేక్పేట మండల రెవెన్యూ అధికారులు స్పందించారు. జింఖానా క్లబ్కు చెందిన భవన నిర్మాణ సామగ్రిని తొలగించడంతో పాటు లేబర్ కోసం వేసిన గుడిసెలను కూల్చివేశారు.
వివరాల్లోకి వెళ్తే.. షేక్పేట మండలంలోని సర్వే నెంబర్ 403/పి, టీఎస్ నెంబర్ -1, బ్లాక్-హెచ్, వార్డు-9లో సుమారు 3ఎకరాలకు పైగా ప్రభుత్వ స్థలం ఉంది. ఈ స్థలంపై వివిధ న్యాయస్థానాల్లో వివాదాలు సైతం పెండింగ్లో ఉన్నాయి. ఈ స్థలాన్ని అనుకుని ఉన్న ప్రైవేటు స్థలంలో జింఖానా క్లబ్కు చెందిన భారీ భవనాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాణ సామాగ్రిని పక్కనున్న ఖాళీ ప్రభుత్వ స్థలంలో వేయడంతో పాటు సుమారు 2 వేల గజాల స్థలాన్ని చదునుచేసి గత కొన్నిరోజులుగా తమ సొంతానికి వాడుకుంటున్నారు. నిర్మాణానికి సంబంధించిన కార్మికుల కోసం సుమారు పెద్ద ఎత్తున గుడిసెలు వేశారు. సుమారు రూ.60కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నాలు జరుగుతున్న వ్యవహారంపై గురువారం ‘నమస్తే’ సమగ్రమైన కథనం ప్రచురించడంతో షేక్పేట తహసీల్దార్ అనితారెడ్డి స్పందించారు. ప్రభుత్వ స్థలంలో వెలిసిన ఆక్రమణలు తక్షణమే కూల్చేయాలని సిబ్బందిని ఆదేశించారు. దీంతో జేసీబీల సాయంతో ఆక్రమణలను కూల్చేచడంతో పాటు ప్రభుత్వ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ స్థలంలో ఎలాంటి ఆక్రమణలు వచ్చినా క్రిమినల్ కేసు నమోదు చేయిస్తామని తహసీల్దార్ అనితారెడ్డి హెచ్చరించారు.