శంషాబాద్ రూరల్, ఆగస్టు 29: రాత్రి సమయంలో ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న భార్యాభర్తలను టార్గెట్ చేసి, దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను శంషాబాద్ ఎస్ఓటీ, తలకొండపల్లి పోలీసులు పట్టుకున్నాడు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి మీడియాకు వెల్లడించారు. కొత్తూరు మండలంలోని రంగాపూర్ గ్రామానికి చెందిన వంశీ పాత నేరస్తుడు. జైలుకు వెళ్లినా అతడి బుద్ధి మారలేదు. వ్యసనాలకు బానిసైన అతడు.. డబ్బు కోసం చైన్ స్నాచింగ్ చేయడం మొదలు పెట్టాడు. ఇందుకు కర్ణాటకకు చెందిన అశోక్ను, ఆంధ్రప్రదేశ్కు చెందిన సాయిరాం, కొత్తూరు మండలానికి చెందిన హరీశ్వర్రెడ్డి, దుర్గాతో కలిసి ఓ ముఠాను ఏర్పాటు చేశాడు. వీరంతా రాత్రి సమయంలో తిరుగుతూ.. ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న దంపతులను టార్గెట్ చేసుకొని.. చైన్ స్నాచింగ్ నేరాలకు పాల్పడుతున్నారు. గడిచిన మూడు నెలల్లోనే ఎనిమిది నేరాలకు పాల్పడ్డారు.
తలకొండపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో ఈ నెల 14న ఓ మహిళ మేడలో నుంచి బంగారు నగలు దోచుకుపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. సోమవారం తలకొండపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో వంశీని అదుపులోకి తీసుకొని విచారించగా.. తనతోపాటు మరో ఇద్దరు ఉన్నట్లు తెలిపాడు. దీంతో వంశీతో పాటు ఆశోక్, సాయిరామ్ను అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. కడ్తాల్, తలకొండపల్లి, నాగర్ కర్నూల్ జిల్లాలోని వెల్దండ, కల్వకుర్తి, జెడ్చర్ల పోలీసు స్టేషన్ల పరిధిలో ఈ ముఠా చోరీలకు పాల్పడింది. వాహనాలను కూడా చోరీ చేశారు. ఈ ముఠా దోచుకున్న బంగారాన్ని ముత్తూట్ ఫైనాన్స్తో పాటు పలు ఇతర బంగారం దుకాణాల్లో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నారు. ఆ డబ్బుతో జల్సాలు చేశారు. నిందితుల నుంచి బంగారంతో పాటు ద్విచక్ర వాహనాలు, ఓ కారు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు. ముఠా సభ్యులపై పీడీ యాక్టు నమోదు చేస్తామన్నారు. ఈ సమావేశంలో షాద్నగర్ ఏసీపీ రంగస్వామి, శంషాబాద్ ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గౌడ్, అమన్గల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్సైలు వెంకటేశ్, శ్రీకాంత్, తరుణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ ముఠాను పట్టుకున్న ఎస్ఓటీ పోలీసులను డీసీపీ అభినందించి, రివార్డులు అందజేశారు.