కుత్బుల్లాపూర్, ఫిబ్రవరి 7 : వ్యవసాయరంగాన్ని అభివృద్ధి చేయడంతో పాటు దానిపై ఆధారపడి జీవిస్తున్న రైతు కుటుంబాలు ఆర్థికంగా ఎదిగేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని తెలంగాణ రాష్ట్ర ఆగ్రోస్ ఇండస్డ్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి అన్నారు. రైతులకు కావాల్సిన నూతన యంత్రాలు, ఎరువులు, విత్తనాలు ఒకేచోట అందుబాటులో ఉంచేందుకు “వన్ షాప్.. వన్ స్టాప్” నినాదంతో ప్రాజెక్టును తీసుకువస్తున్నామని తెలిపారు. నూతన చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన ఆయన తొలిసారిగా కుత్బుల్లాపూర్ డివిజన్ చింతల్ ప్రధాన రహదారిలో ఉన్న టీఎస్ ఆగ్రోస్ సంస్థను సందర్శించిన ఆయన సంస్థలో పనిచేస్తున్న అధికారులు, విధివిధానాలు, రైతులకు అందుతున్న సేవలతో పాటు ఇతర క్రియాశీలక అంశాలపై మేనేజింగ్ డైరెక్టర్ కె.రాములును అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇస్కాన్ సంస్థ అనుబంధంతో సిరిధాన్యాలు పండించి దుకాణాల ఏర్పాటు, తెలంగాణ విజయడెయిరీ అనుబంధంతో పాల సేకరణ, వాటి ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడం వంటి అనేక అంశాలపై టీఎస్ ఆగ్రోస్ దృష్టి సారించిందని పేర్కొన్నారు. ఉమ్మడి 10 జిల్లాల కేంద్రాల్లో వన్ షాప్.. వన్ స్టాప్ నినాదంతో రైతులకు మెరుగైన సేవలను అందించే దిశగా ఎరువులు, పరికరాలు, యంత్రాలను అందుబాటులో ఉంచుతున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్ ఆగ్రోస్ సంస్థలకు చెందిన భూముల విషయంలో ఇప్పటికే సర్వే చేపట్టి పూర్తిచేశామని, కబ్జాకు గురైన భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు న్యాయపరమైన చర్యలు చేపట్టామని చెప్పారు. చింతల్ సంస్థ ప్రాంగణంలో ఉన్న సంస్థకు చెందిన ఖాళీ స్థలాలను అద్దెకు ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని, తుక్కుగా పడిఉన్న యంత్ర పరికరాలను వేలం వేస్తామని తెలిపారు. వ్యవసాయరంగంలో వస్తున్న నూతన పద్ధతులు, ఇతర వాటిపై రైతులకు ఎప్పటికప్పుడు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి వివరిస్తామని తెలిపారు. అనంతరం సంస్థలో పలు విభాగాలను సందర్శించి, వివిధ వ్యవసాయ యంత్రాలను పరిశీలించారు. ఆయన వెంట ఆగ్రోస్ రీజనల్ మేనేజర్ వెంకన్న, అడ్మిన్ చందర్రావు, తదితరులు ఉన్నారు.