శేరిలింగంపల్లి, జనవరి 19 : నానక్రాంగూడ 149 సర్వేనెంబర్లో జీవో 59ను అడ్డుపెట్టుకొని జరిగిన అవకతవకల్లో ప్రధాన సూత్రధారి గోపన్పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు పీ.సురేందర్ అని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. శుక్రవారం సర్వేనెంబర్ 149లోని అక్రమంగా రెగ్యులరైజ్ చేసిన 7 ఎకరాల ప్రభుత్వ భూమిని స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబాతో కలిసి ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోట్లాది రూపాయల విలువ జేసే ప్రభుత్వ స్థలాన్ని కాంగ్రెస్ నాయకుడు సురేందర్ అతని భార్య, కుటుంబ సభ్యులు, బినామీల పేర్ల మీద రెగ్యులరైజ్ చేసుకున్నాడని చెప్పారు. 6 గంటలకు కన్వెన్స్ డీడ్ రిజిస్ట్రేషన్లు కావడం, మళ్లీ 7: 30 గంటలకు ఇతరుల పేరు మీద (కొన్ని నిర్మాణ సంస్థలు) రిజిస్ట్రేషన్లు చేశారని చెప్పారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా పక్కా పథకంతో నడిపించారని, ఆధారాలు, డాక్యుమెంట్లు మీడియా ముందుకు తీసుకువచ్చినట్లు చెప్పారు.
ఈ వ్యవహారానికి బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేసి, కాంగ్రెస్ నాయకుడు పల్లపు సురేందర్, ఇతర వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గాంధీ డిమాండ్ చేశారు. ఇందులో బీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యేలకు ప్రమేయం ఉన్నట్లు ఓ పత్రికలో (నమస్తే తెలంగాణ కాదు) తప్పుడు కథనాలు ప్రచురితం చేయడాన్ని ఆయన ఖండించారు. అనంతరం స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ ఈ భూ తతంగంపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.