శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 24: గ్రేటర్ హైదరాబాద్లో ఆస్త్తి పన్ను వసుళ్లలో శేరిలింగంపల్లి సర్కిల్-20 ముందు వరుసలో దూసుకెళ్తున్నది. మొత్తం గ్రేటర్లోని 30 సర్కిళ్లలో అధిక ఆస్తిపన్ను వసూలు చేసే సర్కిల్గా శేరిలింగంపల్లి సర్కిల్ మొదటి స్థానంలో రికార్డు సాదించేందుకు పరుగులు తీస్తున్నది. అత్యధికంగా ఆస్తిపన్ను వసూళ్లను ఛేదించడంలో సంబంధిత సర్కిల్ అధికారులు ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు. వెస్ట్జోన్ కమిషనర్ శంకరయ్య ఆదేశాల మేరకు సర్కిల్-20 ఉపకమిషనర్ డీసీ వెంకన్న పర్యవేక్షణలో సర్కిల్ రెవెన్యూ యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.
2022-23 ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్ను ముగింపు నేపథ్యంలో మొత్తం 202 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇతర సర్కిళ్లకు ఆదర్శంగా నిలిచింది. 100 శాతం లక్ష్యంతో పనిచేసేందుకు సర్కిల్-20 అధికార యంత్రాంగం పనులు చేపడుతున్నది. 2022 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2023 ఫిబ్రవరి 24 వరకు సర్కిల్ పరిధిలో మొత్తం 88,275 మంది టాక్స్ చెల్లింపుదారుల నుంచి రూ.202 కోట్లకు పైగా చెల్లింపులు రాబట్టారు. వినియోగదారుల సేవా కేంద్రాలు, మీ-సేవా, ఆన్లైన్, బిల్కలెక్టర్లు ద్వారా పెద్ద ఎత్తున జీహెచ్ఎంసీ ఇంటిపన్ను వసూళ్లు లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. 2022-23 గడువు తేది మార్చి 31 నాటికి పూర్తి స్థాయిలో టార్గెట్ సాధించేందుకు విశేషంగా కృషి చేస్తున్నారు.
సర్కిల్ పరిధిలో ప్రత్యేక డ్రైవ్లు..
శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలో ఇంటి పన్ను వసూళ్లలో స్పెషల్ డ్రైవ్లు చేపడుతున్నారు. ఆస్తిపన్ను పరిష్కార వేదికలను ఏర్పాటు చేసి వినయోగదారులకు అవగాహన కల్పిస్తున్నారు. సర్కిల్లో రెవెన్యూ అధికార యంత్రాంగం ప్రత్యేకంగా టాక్స్ వసూళ్లపై దృష్టిసారిస్తున్నారు. ముఖ్యంగా ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న వాటిని గుర్తించి సంబంధిత యజమానులతో మాట్లాడి బకాయిలు రాబట్టేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇళ్లతో పాటు ముఖ్యంగా వాణిజ్య, వ్యాపార సముదాయాలు, సంస్థల ద్వారా టాక్స్ వసూళ్లు పక్కాగా రాబట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. సర్కిల్ కార్యాలయంలో ఆస్తిపన్ను పరిష్కార వేదిక ప్రత్యేక శిబిరాలతో పాటు అధిక రాబడి కలిగిన పేరొందిన సంస్థలను గుర్తించి టాక్స్ వసూళ్లు సేకరిస్తున్నారు.