సిటీబ్యూరో, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ)/మేడ్చల్ : ఉన్నతమైన ఉద్యోగంలో ఉండి, దురాశతో గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్న ఒక సీడ్స్ సైంటిస్ట్ సహా 15 మందిని సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.53,510తో పాటు రూ.61,620 విలువజేసే గ్యాంబ్లింగ్ కాయిన్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. మేడ్చల్- మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన పేగినేని రాజేశ్ (40) ఓ సీడ్స్ కంపెనీలో సీనియర్ సైంటిస్ట్. ఆయన గత మూడేండ్లుగా స్థావరాలను మారుస్తూ.. పెద్ద ఎత్తున ప్రొఫెషనల్ గ్యాంబ్లింగ్ నిర్వహిస్తూ, అక్రమ సంపాదనకు అలవాటు పడ్డాడు. గ్యాంబ్లింగ్లో పాల్గొనే ప్రతి ఒక్కరి వద్ద నుంచి ఒకరోజు అడ్వాన్స్గా రూ.20వేలు తీసుకుని, వాటికి బదులుగా గ్యాంబ్లింగ్ ప్లాస్టిక్ కాయిన్స్ ఇస్తాడు.
ఒక రోజులో 50 వరకు గేమ్స్ నిర్వహించే నిందితుడు, ప్రతి గేమ్కు వెయ్యి రూపాయలు చొప్పున ఆర్గనైజర్ కమీషన్ వసూలు చేశాడు. గత కొన్ని రోజులుగా గుట్టుచప్పుడు కాకుండా కండ్లకోయ టీచర్స్ కాలనీలోని ఫ్లాట్నం. 12లో పెద్ద ఎత్తున గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు కండ్లకోయ, టీచర్స్ కాలనీలోని ఫ్లాట్నం.12పై దాడులు జరిపి, గ్యాంబ్లింగ్ నిర్వాహకుడైన రాజేశ్తో పాటు మరో 14 మందిని అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ. 53,510 నగదుతో పాటు మొత్తం రూ.1.80లక్షల విలువజేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును మేడ్చల్ పోలీసులకు అప్పగించారు.