సిటీబ్యూరో, జూన్ 23(నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో జూలై 2, 3 తేదీల్లో జరుగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం, బహిరంగ సభ కార్యక్రమాలకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ హాజరవుతుండటంతో హైదరాబాద్ పోలీసులు భారీ బందోబస్తును నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీపీ సీవీ ఆనంద్ నేతృత్వంలో బషీర్బాగ్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జీహెచ్ఎంసీ, అగ్నిమాపక శాఖ, టీఎస్ఎస్పీడీసీఎల్, ఆర్అండ్బీ, పోలీసు అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. నోవాటెల్, పరేడ్ మైదానంలో జరుగుతున్న వేడుకులకు చేయాల్సిన ఏర్పాట్లపై సలహాలు, సూచనలు ఇచ్చారు. పాసులు ఉన్న వారిని మాత్రమే బహిరంగ సభ, కార్యవర్గ సమావేశానికి అనుమతించాలని తెలిపారు. బందోబస్తును పరిశీలించే అధికారులు తప్పనిసరిగా ఎస్పీజీ-బ్లూ బుక్ పాటించాలని, వారితో నిరంతరం సమన్వయం చేసుకోవాలని చెప్పారు.
కొవిడ్ నిబంధనలు తప్పనిసరి
మోదీ సభకు హాజరయ్యే ప్రతి ఒక్కరూ ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకోవాలని, కరోనా నిబంధనలు పాటించాలని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. బహిరంగ సభకు వచ్చే వారి వాహనాల పార్కింగ్ కోసం ఆర్మీ, కంటోన్మెంట్ అధికారులతో చర్చించి స్థలాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రత్యేక బందోబస్తు నిర్వహించేందుకు రూపొందించిన యాక్షన్ ప్లాన్ పై సీపీ చర్చించారు. నిరసనలు తెలియజేయడానికి వచ్చే వారిపై నిఘా పెట్టాలన్నారు. వైద్య శాఖ కూడా ప్రత్యేక వైద్య బృందాలు, అంబులెన్స్లను అందుబాటులో ఉంచాలని తెలిపారు. కమాండ్ కంట్రోల్ నుంచి వచ్చే ఆదేశాలను స్వీకరించి చర్యలు చేపట్టాలన్నారు.
సభకు ప్రధాని హాజరవుతున్నందున అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. 20వేల మందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్, సిటీ అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్, జాయింట్ సీపీ అడ్మిన్ రమేశ్, జాయింట్ సీపీ ట్రాఫిక్ రంగానాధ్, ఆర్మ్ హెడ్ క్వార్టర్స్ జాయింట్ సీపీ కార్తికేయ, ట్రాఫిక్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి, డీసీపీ జోయెల్ డేవిస్, కంటోన్మెంట్ బోర్డు సీఈఓ అజిత్రెడ్డి, ఈఎంఆర్ఐ నరేందర్రెడ్డి, ఏఓసీ కేంద్రం కల్నల్ సంజీవ్కుమార్, ఆర్అండ్బీ ఈఈ శ్రీనివాస్, అగ్నిమాపక శాఖ అడిషనల్ డైరెక్టర్ జీవీ నారాయణరావు, ఫైర్ ఆఫీసర్ పాపయ్య, ఎయిర్పోర్టు సీఎస్ఓ శివయ్య, టీఎస్ఎస్పీడీసీఎల్ డైరెక్టర్ శ్రీనివాస్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.