హైదరాబాద్ : నగరంలోని గాంధీ ఆస్పత్రిలో అత్యాచార ఆరోపణల కేసులో పురోగతి లభించింది. సెక్యూరిటీ గార్డ్ విజయ కిశోర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. సదరు మహిళపై తాను అత్యాచారం చేయలేదని, ఆమె అంగీకారంతోనే శారీరకంగా కలిసినట్లు కిశోర్ తెలిపాడు. గత నెల 27న గాంధీ ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డుగా చేరిన కిశోర్.. ఈ ఘటన తర్వాత కనిపించకుండా వెళ్లిపోయాడు. దీంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా ఈ విషయాలు బయటపడ్డాయి. విజయ కిశోర్ స్వస్థలం హన్మకొండ జిల్లా కాజీపేట.
గాంధీ ఆస్పత్రి ఘటనలో అదృశ్యమైన మహిళ ఆచూకీ లభ్యమైంది. హిమాయత్నగర్లోని వాసు మెడికల్ హాల్ వద్ద సదరు మహిళ సంచరిస్తుండగా నారాయణగూడ పోలీసులు గుర్తించారు. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా.. గాంధీ ఆస్పత్రి ఘటనను పోలీసులకు చెప్పింది. ఈ క్రమంలో ఇన్స్పెక్టర్ గట్టుమల్లు సెంట్రల్ జోన్ డీసీపీ విశ్వప్రసాద్కు సమాచారం అందించారు. డీసీపీ ఆదేశాల మేరకు మహిళను నార్తో జోన్కు తరలించారు పోలీసులు.
మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కిడ్నీ సమస్యతో బాధపడుతుండటంతో అతన్ని గాంధీ ఆస్పత్రికి ఈ నెల 5న తీసుకొచ్చారు. అతని వెంట భార్య, మరదలు కూడా వచ్చారు. ఈ క్రమంలో ఇద్దరి మహిళలపై అత్యాచారం జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. చెల్లి నేరుగా మహబూబ్నగర్కు వెళ్లగా, ఆమె అక్క కనిపించకుండా పోయింది. దీంతో తన అక్క కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా సెక్యూరిటీ గార్డే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేలింది.