ప్రశాంతంగా సాగేలా అధికారుల చర్యలు
యాత్ర దారిలో చెట్ల కొమ్మల తొలగింపు, రోడ్లకు మరమ్మతులు
అబిడ్స్, ఏప్రిల్ 7: శ్రీరామ నవమి సందర్భంగా నిర్వహించే శోభాయాత్ర ప్రశాంతంగా సాగేలా పోలీసులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి సందర్భంగా శోభాయాత్రను నిర్వహిస్తారు. ఈ యాత్రలో వేలాది మంది యువకులు, భక్తులు పాల్గొంటారు.ఇందుకోసం పోలీస్ అధికారులు అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నారు.
ఈనెల 10వ తేదీన యాత్ర ప్రారంభం కానుండగా జీహెచ్ఎంసీ అధికారులు శోభాయాత్ర జరిగే రహదారిలో చెట్టు కొమ్మలను తొలగించడం, రోడ్లపై ప్యాచ్ వర్క్ పనులను చేపడుతున్నారు. సీతారాంబాగ్, ధూల్పేట్, జాలిహనుమాన్, పురానాపూల్, జుమ్మెరాత్బజార్, చుడీబజార్, బేగంబజార్ ఛత్రి, సిద్ధ్దంబర్ బజార్ల మీదుగా హనుమాన్ టేక్డీలోని వ్యాయామ శాలకు యాత్రను నిర్వహించనున్నారు. ఈ యాత్రలో ప్రముఖ గురువులు పాల్గొననున్నారు. శోభాయాత్ర సందర్భంగా అడుగడుగునా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.వివిధ పోలీస్ స్టేషన్లకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొనేలా ప్రణాళికలు సిద్ధ్దం చేసుకుంటున్నారు. నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ రూట్ను పరిశీలించి తీసుకోవాల్సిన బందోబస్తు ఏర్పాట్ల గురించి అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు.
సిద్ధంబర్బజార్ తారా ఇంటర్నేషనల్ హోటల్లో జరిగిన శ్రీరామ నవమి శోభాయాత్ర సన్నా హక సమావేశంలో పాల్గొన్న జాయింట్ పోలీస్ కమిషనర్ రమేశ్రెడ్డిని సన్మానించిన జాంబాగ్ డివిజన్ కార్పొరేటర్ రాకేశ్జైస్వాల్, బేగంబజార్ డివిజన్ కార్పొరేటర్ శంకర్యాదవ్