సిటీబ్యూరో, మే 15 (నమస్తే తెలంగాణ) : సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్కు ప్రయాణికుల నుంచి అధిక డిమాండ్ ఏర్పడటంతో ఈ రైలులో అదనపు బోగీలు ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ ఎక్స్ప్రెస్లో 8 బోగీలు, 530 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ బోగీలను 16కు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం, రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో మొత్తం 1,128 సీట్లు అందుబాటులోకి వచ్చినట్లు సోమవారం దక్షిణ మధ్య రైల్వే జోనల్ అధికారులు తెలిపారు. అదనపు బోగీలు ఈ నెల 17 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి తిరుపతి, తిరుపతి నుంచి సికింద్రాబాద్ మధ్య నడిచే ఈ రైలు ప్రయాణం చేయడానికి 8.30 గంటల సమయం పడుతుంది. అయితే ఈ ప్రయాణ సమయాన్ని 15 నిమిషాలు తగ్గించారు. దీంతో 8.15 గంటలకే ఈ రెండు స్టేషన్ల మధ్య రాకపోకలు కొనసాగించనున్నట్లు తెలిపారు.
138 శాతానికి పెరిగిన ప్రయాణికుల స్పందన..
సికింద్రాబాద్-తిరుపతి స్టేషన్ల మధ్య ప్రారంభించిన వందేభారత్ ఎక్స్ప్రెస్కు ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ రైలు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు డిమాండ్ 131 నుంచి 138 శాతానికి పెరిగిందని రైల్వే అధికారులు అధికారికంగా ధ్రువీకరించారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం 44,992 మంది ప్రయాణికులు ఇందులో ప్రయాణం చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. వేసవి సమయంలో తిరుపతికి వెళ్లే ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.