సిటీబ్యూరో, మార్చి 26 (నమస్తే తెలంగాణ) : నగరానికి సుపరిచితులు.. రాజకీయాల్లో సికింద్రాబాద్ అంటేనే గుర్తుకొచ్చే పేరు పద్మారావు.. కాబోయే సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఎంపీ పజ్జన్న అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. తొలిసారిగా సికింద్రాబాద్ పార్లమెంట్పై గులాబీ జెండా ఎగురబోతున్నదని కేటీఆర్ అన్నారు. 24 ఏండ్లుగా పద్మారావుగౌడ్ పార్టీకి నగరంలో అండగా ఉన్నారని, ఎంపీ అభ్యర్థిగా ఆయన పేరు ప్రకటన అయిన రెండు గంటల వ్యవధిలోనే మంచినిర్ణయం తీసుకున్నారని, ప్రతి కార్యకర్తకు, నాయకుడికి విశ్వాసం కలిగిందంటూ పదుల సంఖ్యలో తానకు ఎస్ఎంఎస్లు వచ్చాయని కేటీఆర్ చెప్పారు.
సికింద్రాబాద్లో పోటీ ఒక విఫల ఎంపీ కిషన్రెడ్డి, అవకాశవాద ఎమ్మెల్యే దానం నాగేందర్కు, ఇంకోవైపు నిబద్ధత కలిగిన పద్మారావు మధ్య ఉన్నదని వివరించారు. మంగళవారం తెలంగాణ భవన్లో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం విస్తృతస్థాయి సమావేశానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలను ఉద్ధేశించి ప్రసంగించారు. రాబోయే 53 రోజుల పాటు కార్యకర్తలు, నేతలంతా ప్రజల్లోనే ఉండి పద్మారావు గెలుపులో కంకణబద్దులై పనిచేయాలని పిలుపునిచ్చారు.
రాజకీయాల్లో హత్యలుండవు.. ఆత్మహత్యలే ఉంటాయని, దానం నాగేందర్ తీసుకున్న నిర్ణయం తప్పు అని తెలిసేలా మనం ఎన్నికల్లో గెలిచి చూపించాలని కేటీఆర్ అన్నారు. దానం నాగేందర్ ఆధికారానికి ఆశపడి గెలిపించిన ప్రజలకు ద్రోహం చేసి వెళ్లాడని, ఖైరతాబాద్ ప్రజలే మన పార్టీని గెలిపించి, ఆయన నిర్ణయం తప్పని నిరూపిస్తారన్న నమ్మకం తనకు ఉన్నదని కేటీఆర్ పేర్కొన్నారు. దానం నాగేందర్పైన ఇప్పటికే స్పీకర్ను కలిసి ఫిర్యాదు చేశామని, ఆయనను అనర్హుడిగా ప్రకటించకపోతే సుప్రీంకోర్టు దాకా వెళ్లి మరీ అనర్హుడిగా ప్రకటించేలా చేస్తామని తెలిపారు.
మూడు, నాలుగు నెలల్లోనే ఖైరతాబాద్కు ఉప ఎన్నిక వస్తుందని, ప్రజలు దానికి సిద్ధంగా ఉండాలని, ద్రోహం చేసిన వారికి బుద్ది చెప్పాలని కేటీఆర్ అన్నారు. సికింద్రాబాద్లో మన పోటీ కాంగ్రెస్తో లేనే లేదని, దానం నాగేందర్ను ప్రజలు సీరియస్గా తీసుకోవడం లేదన్నారు. ఇక కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్రెడ్డి అతిపెద్ద మూడు పనులు నియోజకవర్గానికి చేశారని విమర్శించారు. కురుకురే ప్యాకెట్లు పంచడం, సీతాఫల్మండిలో రైల్వే లిఫ్ట్ ఓపెన్ చేయడం, సింటెక్స్ ట్యాంకులను ఓపెన్ చేయడం తప్ప హైదరాబాద్కు ఆయన చేసిందేమి లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఆయన సొంత నియోజకవర్గం అంబర్పేటలో కనీసం ఫ్లై ఓవర్ను పూర్తి చేయలేకపోయాడని మండిపడ్డారు.
– ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్
బీఆర్ఎస్ పార్టీకి ఉద్యమాలు, పోరాటాలు కొత్త కాదని, ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ విధానాలపైన పోరాడుతామని సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ అన్నారు. లక్షలాది మంది పార్టీ కార్యకర్తలు, నాయకుల కృషి, శ్రమ, త్యాగం వల్లనే ఈ రోజు బీఆర్ఎస్ పటిష్టంగా ఉందన్నారు. ఈ ఎన్నికల్లో బీసీలకు పార్టీ అధికంగా అవకాశం ఇచ్చిందని, బీసీలంతా ఏకమై బీఆర్ఎస్కు పట్టం కట్టాలని పద్మారావు గౌడ్ పిలుపునిచ్చారు.
– తలసాని శ్రీనివాస్ యాదవ్
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో విద్యుత్, నీటి కష్టాలు మొదలయ్యాయని మాజీ మంత్రి, సనత్నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడం మరిచిందని విమర్శించారు. త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాన్ని ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, కార్యకర్తలు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికలలో సమష్టిగా పనిచేసి సికింద్రాబాద్ నియోజకవర్గం అభ్యర్థి పద్మారావు గౌడ్ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందామని అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ నిరంతరం ప్రజలతోనే ఉంటుందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా తాగునీటిని సరఫరా చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం బిల్లులు పంపుతుందని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు హామీలను వందరోజుల్లో అమలు చేస్తామని చేయలేదని, పార్లమెంట్ ఎన్నికల అనంతరం ప్రజల పక్షాన ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, హైదరాబాద్ పార్టీ ఇన్చార్జి డాక్టర్ దాసోజు శ్రవణ్, మాజీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, కార్పొరేటర్లు, ఇతర నాయకులు పాల్గొన్నారు.