గ్రేటర్ రాజకీయాల్లో తనదైన ప్రత్యేక ముద్ర వేసి.. వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న హఠాన్మరణం గ్రేటర్వాసులను తీవ్రంగా కలచివేసింది. ముఖ్యంగా కంటోన్మెంట్ ప్రాంతంలో విషాదఛాయలు అలుము కున్నాయి. సీనియర్ శాసన సభ్యుడిగా గ్రేటర్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన సాయన్న.. ఎమ్మెల్యేగా ఐదు సార్లు ఎంపికయ్యారు. అజాతశత్రువుగా పేరు తెచ్చుకున్నారు. అనారోగ్యంతో ఆదివారం తుదిశ్వాస విడిచారు. పలువురు ప్రజాప్రతినిధులు ఆయన మృతిపట్ల సంతాపం తెలిపారు. సాయన్న భౌతికకాయానికి సీఎం కేసీఆర్ శ్రద్ధాంజలి ఘటించారు. కుటుంబసభ్యులను ఓదార్చారు. సోమవారం మారేడ్పల్లి శ్మశానవాటికలో సాయన్న అంత్యక్రియలు జరుగనున్నాయి.
సిటీబ్యూరో, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ) : అభివృద్ధి ఒక్కటే సరిపోదు, సంక్షేమం కూడా అందరికీ అందాలని నిత్యం తపించే నాయకుడు ఎమ్మెల్యే జి.సాయన్న. ‘సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్’ల సహకారంతో కంటోన్మెంట్ నియోజకవర్గానికి అత్యధిక నిధులు తీసుకువచ్చి, అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దారు. ఈ రెండింటి కోసం ఎనిమిదేళ్ల కాలంలో నియోజకవర్గంలో దాదాపు వందల కోట్లు ఖర్చు చేసి, ఉచిత తాగునీరు, విద్య, వైద్యం, రోడ్లు, పింఛన్లు, దళితబంధు, సీఎంఆర్ఎఫ్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రేషన్కార్డులు, డబుల్ బెడ్ రూం ఇండ్లు.. ఇలా అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ముందుకు పాలన సాగించిన సాయన్న జనాన్ని వదిలి..
స్వర్గానికేగినాడు. వివాద రహితుడిగా.. రాజకీయాల్లో అజాతశుత్రువుగా అందరి మన్ననలు పొందాడు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు ఆయనకు ఉంది. ప్రజలతో ప్రతి నిత్యం మమేకమై అనేక సమస్యలను పరిష్కరించి, మృధు స్వభావిగా మంచిపేరు తెచ్చుకున్నారు. కులమతాలు, ప్రాంతాలు, రాజకీయాలకు అతీతంగా వ్యవహరించే ఎమ్మెల్యే సాయన్న ఆదర్శవంతమైన వ్యక్తిగా తనదైన ముద్ర వేసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు నచ్చిన వ్యక్తిగా, మెచ్చిన ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్నారు. వివాద రహితుడిగా, విమర్శలకు దూరంగా ఉంటూ.. కారు డ్రైవర్ నుంచి అధికారుల వరకు అందరినీ గౌరవించే విశిష్ట వ్యక్తిత్వం ఆయన సొంతం.
అందరినీ కలుపుకునిపోయే వ్యక్తి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు
అందరినీ కలుపుకునిపోయే వ్యక్తి సాయన్న మృతి చెందడం బాధాకరమని మల్కాజిగిరి ఎమ్మెల్యే ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవలందించిన సాయన్నను ప్రజలు మరిచిపోరని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.
తీరని విషాదంమర్రి రాజశేఖర్రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి
కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న హఠాన్మరణంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా వినయం, విధేయతలు ఆయన చిరునామా. ఏడు పదుల వయస్సులోనూ హుందా గల నేతగా పేరుగాంచిన ఎమ్మెల్యే సాయన్న మనకి దూరం కావడం తీరని విషాదం. సాయన్న కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం.
ఎమ్మెల్యేగా ప్రస్థానం
టీడీపీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన జ్ఞాని సాయన్న 1994లో తొలిసారిగా హైదరాబాద్ జిల్లా కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నాటి నుంచి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యాడు. అనంతరం 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరుఫున విజయం సాధించి, టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచారు. ఎమ్మెల్యే సాయన్న ఉమ్మడి ఆంద్రప్రదేశ్లో ఆరుసార్లు హుడా డైరెక్టర్గా, శాసనసభ వీధిబాలల పునరావసంపై హౌస్ కమిటీ చైర్మన్గా, హెచ్సీ చైల్డ్ ట్రాఫికింగ్గా విధులు నిర్వర్తించారు.
తల్లితండ్రులంటే ప్రాణం
తన తల్లితండ్రులు సాయన్న- భూదేవిలంటే ఎమ్మెల్యే సాయన్నకు పంచప్రాణాలు. వారి భావాలను పుణికి పుచ్చుకుని అదే అడుగుజాడల్లో నడిచారు. గతంలో రాజకీయాలతో పరిచయం లేకపోయినా నిజామాబాద్ జిల్లాకు చెందిన సాయన్న చదువు నిమిత్తం నగరంలోని కవాడిగూడకు మకాం మార్చారు. తొలుత ఓ ప్రైవేట్ బ్యాంకులో క్యాషియర్గా పని చేశారు. అనంతరం టీడీపీలో చేరిన తరువాత కంటోన్మెంట్ ఎస్సీ నియోజకవర్గం కావడంతో పార్టీ ఆదేశాలతో కంటోన్మెంట్లో ఎమ్మెల్యేగా బరిలోకి దిగారు. నగర టీడీపీ అధ్యక్షుడిగా పనిచేసిన ఎమ్మెల్యే సాయన్న ప్రచార బాధ్యతలు నిర్వహించి ప్రజలతో మమేకమయ్యారు.
రాజకీయాల్లో అజాతశత్రువు
రాజకీయాల్లో బీష్ముడిలాంటి వారు ఎమ్మెల్యే సాయన్న. కష్టం అని ఎవరొచ్చినా.. వారిని ఆప్యాయంగా పలుకరించి సమస్యలను పరిష్కరించడంలో దిట్ట. ఒకసారి మనసుకు నచ్చితే స్నేహాన్ని వదులుకోరు. అందుకే తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు ఎంతో మంది స్నేహితులు ఉన్నారు. రాజకీయ, వ్యాపార, సినీ, పారిశ్రామిక రంగాల్లో ప్రముఖులంతా ఆయనకు సుపరిచితులే. కాగా నగరంలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా దాదాపు 1500 ఇండ్ల నిర్మాణానికి కృషి చేసిన ఘనత సాయన్నకే దక్కింది. కంటోన్మెంట్లో ఉచిత తాగునీటి సౌకర్యం, రోడ్ల నిర్మాణం, బోర్డు పరిధిలో అభివృద్ధి, పేదల బస్తీలో మౌలిక సదుపాయాల కల్పన, విద్య, వైద్యం వంటి వాటికి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చారు.
కార్పొరేటర్గా ఓటమి.. ఎమ్మెల్యేగా గెలుపు
రాజకీయ ప్రస్థానం తొలినాళ్లలో బ్యాంకు ఉద్యోగి అయిన సాయన్న అనూహ్యంగా 1986లో నాటి బల్దియా ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేశారు. ఈ ఎన్నికల్లో కవాడిగూడ నుంచి కార్పొరేటర్గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ ముషీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని ప్రస్తుత ఎమ్మెల్యే ముఠా గోపాల్తో కలిసి చురుకైన తెలుగుదేశం కార్యకర్తగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో 1994 ఎన్నికల్లో సమీప నియోజకవర్గమైన కంటోన్మెంట్ (ఎస్సీ) నుంచి పోటీ చేసే అవకాశం దక్కింది. ఆ ఎన్నికల్లో అప్పటి మాజీ మంత్రి డి.నర్సింగ్రావుపై పోటీ చేశారు. అయితే మరో మాజీ ఎమ్మెల్యే సర్వే సత్యనారాయణ ఇండిపెండెంట్గా పోటీ చేసి డి.నర్సింగ్రావు విజయావకాశాల్ని దెబ్బతీశారు. దీంతో 3,636 ఓట్ల తేడాతో సాయన్న తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.
సాయన్న ఆత్మకు శాంతిచేకూరాలి – మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
సీనియర్ శాసనసభ్యులు సాయన్న మృతి పట్ల మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సంతాపం వ్యక్తం చేశారు. సాయన్న ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడిని ప్రార్థ్ధిస్తూ, వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రజాప్రతినిధిగా ప్రజల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ ఆలోచించే వాడని, నియోజకవర్గం అభివృద్ధికి ఎనలేని కృషి చేశాడని అన్నారు. సాయన్న పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని తెలిపారు. సాయన్న కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలన్నారు.
పునర్విభజనతో ఎదురు దెబ్బ
2009 ఎన్నికల నాటికి కంటోన్మెంట్ నియోజకవర్గం పునర్విభజన జరిగింది. ఈ క్రమంలో కంటోన్మెంట్ నుంచి విడిపోయిన ప్రాంతాలతోనే ప్రస్తుత మల్కాజిగిరి నియోజకవర్గం కొత్తగా ఏర్పాటైంది. కొంత భాగం సికింద్రాబాద్, మరికొంత కూకట్పల్లి నియోజకవర్గాల్లో కలిసిపోయింది. కేవలం కంటోన్మెంట్ బోర్డు ప్రాంతంతో పాటు ఏకైక జీహెచ్ఎంసీ డివిజన్ (మోండా మార్కెట్)తో కంటోన్మెంట్ సరిహద్దులు మారాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పి.శంకర్రావు చేతిలో 4,183 ఓట్ల తేడాతో ఓడిపోయారు. మరోవైపు 2014లో కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంట్కు పూర్తిగా కొత్త వ్యక్తి అయిన గజ్జెల కాంతంకు టికెట్ ఇవ్వడంతో సాయన్నకు కలిసి వచ్చింది. అయితే రాష్ట్రం విడిపోవడంతో తెలంగాణ సెంటిమెంట్ రూపంలో టీఆర్ఎస్ నుంచి గట్టి పోటీ ఎదురైంది.