KTR | తెలంగాణలో బీఆర్ఎస్ గెలిచే మొదటి సీటు సికింద్రాబాదే అని కేటీఆర్ అన్నారు. పద్మారావు మంచి నాయకుడు అని తెలిపారు. ఆనాడు హైదరాబాద్లో గులాబీ కండువా కప్పుకోవడానికి కొంతమంది సిగ్గుపడుతున్నప్పుడు.. మొట్టమొదటిసారి ముందుకొచ్చి 2001లోనే కార్పొరేటర్ ఎన్నికల్లో పోటీ చేసి గులాబీ జెండా ఎగురవేసిన నాయకుడని గుర్తు చేశారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కేసీఆర్ కష్టసుఖాల్లో పద్మారావు ఉన్నారని తెలిపారు. కేసీఆర్ వెంట నడిచిన సైనికుడు పద్మారావు అని అన్నారు. యూసుఫ్గూడలో ఏర్పాటు చేసిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పద్మారావు పోటీలో ఉండటంతో కిషన్ రెడ్డి కూడా భయపడుతున్నాడని తెలిపారు. అంటే ఇక్కడ మన గెలుపు ఖరారైనట్లే అని స్పష్టం చేశారు.
మోదీ జైబులో ఉండాలి లేదంటే జైలులో ఉండాలి అన్నట్లుగా దేశంలో పరిస్థితి మారిందని మండిపడ్డారు. బీజేపీని ఓడించే శక్తి కాంగ్రెస్కు లేదని అన్నారు. బీజేపీకి బీఆర్ఎస్ బీటీమ్ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారని అన్నారు. హైదరాబాద్లో బీఆర్ఎస్ క్లీన్స్వీప్ చేసిందన్నారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించింది బీఆర్ఎస్సే అని తెలిపారు. బండి సంజయ్ను ఓడించింది గులాబీ జెండానే అని తెలిపారు. ధర్మపురి అర్వింద్, ఈటల రాజేందర్, రఘునందన్రావు, సోయం బాపురావును ఓడించింది కూడా బీఆర్ఎస్సే అని స్పష్టం చేశారు. ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల్లో కూడా కిషన్ రెడ్డిని ఓడించేది బీఆర్ఎస్సే అని అన్నారు.
తెలంగాణకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసింది గుండు సున్నా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కరోనా సమయంలో చాలామంది నాయకులు మంచి పనులు చేశారు. సీతాఫల్మండిలో పద్మారావు గౌడ్ రెండు రెండున్నర కోట్లు ఖర్చుపెట్టి అన్నదానాలు చేశారు. కానీ కిషన్ రెడ్డి మాత్రం కుర్కురే ప్యాకెట్లు పంచిండు అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కాళేశ్వరం లిఫ్ట్లు ప్రారంభిస్తే.. కిషన్రెడ్డి సీతాఫల్మండి స్టేషన్లో లిఫ్టులు ప్రారంభించారని విమర్శించారు. నాంపల్లి నియోజకవర్గంలోని గుడిమల్కాపూర్లో సింటెక్స్ ట్యాంకులకు కిషన్ రెడ్డి కొబ్బరికాయలు కొడుతున్నారని అన్నారు. హైదరాబాద్ మూసీకి వరదలొస్తే బీజేపీ పైసా ఇవ్వలేదని తెలిపారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని మోదీ మోసం చేసిండని మండిపడ్డారు. దేశానికి ఏం చేసిండో చెప్పేందుకు ఏమీ లేదు.. అందుకే మాట్లాడితే జైశ్రీరామ్ అని అంటున్నారని అన్నారు. రాముడితో మనకు ఏ పంచాయతీ లేదన్నారు. రాముడు బీజేపీ పార్టీ కాదు.. రాముడు అందరివాడు అని స్పష్టం చేశారు. రాముడిని మొక్కుదాం.. బీజేపీని తొక్కుదాం అని పిలుపునిచ్చారు.