రాష్ట్రంలో అంధత్వ నివారణకు ప్రభుత్వం వెలుగుల యజ్ఞం ప్రారంభించింది. గ్రేటర్ పరిధిలో ప్రజలందరికీ గురువారం నుంచి కంటి పరీక్షలు చేయనున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో జూన్ 30 వరకు మొత్తం 241 ప్రాంతాల్లో 5,058 శిబిరాలను నిర్వహించనున్నారు. 100 రోజుల పాటు సాగే ఈ శిబిరాలకు కంటి పరీక్షల కోసం వచ్చే వారు ఆధార్, రేషన్, ఆరోగ్యశ్రీ కార్డులలో ఏదో ఒకటి తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలి. పరీక్షల అనంతరం అవసరమైన వారికి ఉచితంగా కంటి అద్దాలు, మందులు అందజేస్తారు. ఈ కంటి వెలుగు శిబిరాలను గురువారం అమీర్పేట్లోని వివేకనందనగర్ కమ్యూనిటీ హాలులో ఉదయం 9 గంటలకు, వెంగళరావునగర్ డివిజన్ మధురానగర్ కమ్యూనిటీ హాలులో ఉదయం 10 గంటలకు మంత్రులు హరీశ్రావు, తలసాని శ్రీనివాస్యాదవ్ ప్రారంభిస్తుండగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో జవహర్నగర్ కార్పొరేషన్ పరిధిలోని మల్కారంలో మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రారంభించనున్నారు.
సిటీబ్యూరో, జనవరి 18 (నమస్తే తెలంగాణ ) : తెలంగాణలో అంధత్వ నివారణకు కంటి వెలుగు కార్యక్రమం ద్వారా ఉచిత కంటి వెలుగు శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్రీనింగ్ సెంటర్ల వద్ద ఎలాంటి లోటు పాట్లు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో గురువారం (నేటి) నుంచి జూన్ 30 వరకు కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా మొత్తం 241 లొకేషన్లలో 5058 క్యాంపులను 100 రోజుల పాటు నిర్వహించనున్నారు. ఒక హైదరాబాద్ నగరంలోనే ప్రతి రోజు సుమారు 15,525 మందికి కంటి వెలుగు ద్వారా సేవలు అందించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు 3,81,445 రీడింగ్ అద్దాలను సైతం కంటి వెలుగు శిబిరాలకు తరలించారు.కంటి పరీక్ష కోసం క్యాంపునకు వచ్చే తేదీ, సమయం, శిబిరం వివరాలతో కరపత్రాలను అందజేయనున్నారు.
క్యాంపునకు వచ్చే సందర్భంలో ఆధార్కార్డు గానీ ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డు ఏదో ఒకటి ధ్రువీకరణ పత్రం తీసుకొని రావాల్సి ఉంటు ంది. కంటి సమస్యలు ఉన్న వారు ఉచిత కంటి పరీక్షా శిబిరాలకు వెళ్లి పరీక్షలు పూర్తయిన తర్వాత ఉచితంగా కంటి అద్దాలు, మందులు అందజేస్తారు. కంటి పరీక్షల నిర్వహణ అనంతరం అవసరమైన వారికి రీడింగ్ అద్దాలు అకడికకడే పంపిణీ చేస్తారు. దగ్గర చూపు గానీ దూరం చూపు ఉన్న వారికి 15 రోజుల్లో తమ ఇంటికి పంపిస్తామని అధికారులు తెలిపారు. అలాగే దృష్టి లోపం వివరాలను అప్పటికప్పుడు రాత పూర్వకంగా తెలియజేసి కంటి అద్దాలపై కూడా స్పష్టంగా ముద్రించి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు తమ పరిధిలోని ఆశ వరర్లు, ఏఎన్ఎంను సంప్రదించాలన్నారు.
ఇంటిల్లిపాదికి కంటి వెలుగు
ప్రైవేటు దవాఖానల్లో వేలాది రూపాయలు వెచ్చించే స్థితి లేని పేదలకు కంటి వెలుగు పథకం వరంలా ఉపయోగపడింది. సీఎం కేసీఆర్ తొలిసారి ప్రవేశపెట్టిన కంటి వెలుగు పథకాన్ని ఇంటిల్లిపాది వినియోగించుకొన్నాం. ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులే కాకుండా కండ్ల జోళ్లను అందించారు. కనుచూపు మరింత మెరుగై మా పనులను మేము చేసుకుంటున్నాం. కండ్ల జోడును పెట్టుకున్నపుడల్లా సీఎం కేసీఆర్ సార్నే గుర్తు చేసుకుంటున్నాం. మళ్లీ రెండో విడతగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నందున మా లాంటి పేదలు వినియోగించుకునేలా మా వంతు కృషి చేస్తాం. మా కుటుంబం తరఫున కేసీఆర్ సార్కు ధన్యవాదాలు.
– లక్ష్మీ, పాపిరెడ్డి నగర్
నేడు ‘కంటి వెలుగు’ను ప్రారంభించనున్న మంత్రులు
జూబ్లీహిల్స్, జనవరి 18: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెండో విడత ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని గురువారం మంత్రులు హరీశ్రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్లు జూబ్లీహిల్స్, సనత్నగర్ నియోజకవర్గాల్లో ప్రారంభించనున్నట్లు అధికారులు బుధవారం తెలిపారు. అమీర్పేట్లోని వివేకానంద కమ్యూనిటీ హాల్లో ఉదయం 9 గంటలకు.. వెంగళరావునగర్ డివిజన్ మధురానగర్ కమ్యూనిటీ హాలులో ఉదయం 10 గంటలకు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్తో కలిసి ప్రారంభించనున్నారు. అలాగే మేడ్చల్ జిల్లాలోని జవహర్నగర్ మల్కారంలో కంటి వెలుగును మంత్రి మల్లారెడ్డి ప్రారంభించనున్నారు.
పైసా తీసుకోకుండా అద్దాలు ఇచ్చిండ్రు
కండ్లు బాగా కనిపిస్తున్నాయి. డాక్టర్లు మంచిగా పరీక్ష చేసిండ్రు. మందులు ఆపరేషన్ అవసరం లేదని పైసా తీసుకోకుండానే అద్దాలు ఇచ్చిండ్రు. అద్దాలు పెట్టుకున్నప్పటి నుంచి కండ్లు మంచిగా కనిపిస్తున్నాయి. నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నా ఇట్లా ఎవరూ చేయలేదు. కేసీఆర్ సారు చల్లగా ఉండాలే. పేదళ్లోను పట్టించుకున్నది కేసీఆర్ సారే.
– కేశవత్ లక్ష్మీబాయి, రాయిలాపూర్
కండ్లు కనపడకుండా ఇబ్బంది పడ్డా
ఎన్నో రోజుల నుంచి కండ్లు కనపడకుండా ఇబ్బంది పడ్డా. ఆర్థిక ఇబ్బందులతో దవాఖానకు వెళ్లలేదు. సర్కారు కంటి శిబిరాల ద్వారా కండ్లు చూస్తున్నారని తెలుసుకొని వెళ్లా. డాక్టర్ నా కళ్లు చూసి అద్దాలు ఇచ్చారు. ఇప్పుడు బాగా చూడగలుగుతున్నా. సీఎం కేసీఆర్ సారు బాగుండాలి.
– మానయ్య,మేడ్చల్
కంటి సమస్య తీరింది
దూరపు చూపు కనిపించేది కాదు. మసక మసకగా ఉండేది. ప్రైవేట్ దవాఖానలో చూయించుకుందామంటే డబ్బులు లేక చూయించుకోలే. మూడేండ్ల క్రితం కంటి వెలుగు కార్యక్రమంలో ఉచితంగా కండ్లను పరీక్షించారు. సమస్య ఉన్నదని ఉచితంగా డ్రాప్స్, అద్దాలు ఇచ్చారు. దాదాపు సమస్య తీరింది. చాలా సంతోషంగా ఉంది. ప్రైవేట్ దవాఖానకు పోతే రెండు వేలు ఖర్చు అయ్యేవి.
– లక్ష్మమ్మ, జల్పల్లి
వెంటనే ..అద్దాలు ఇచ్చారు
కంటి వెలుగు కార్యక్రమం పేద ప్రజలకు మేలు చేస్తోంది. గతంలో నేను పరీక్షలు చేయించుకున్నప్పుడు చూపులో రీడింగ్ సమస్య ఉన్నట్లు గుర్తించారు. వెంటనే కంటి అద్దాలు ఇచ్చారు. ఈ సారి కూడా పరీక్షలు చేయించుకుంటా. అందరికీ చూపునిస్తున్న కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు.
– లక్ష్మీప్రసన్న, లింగోజిగూడ, ఎల్బీనగర్ సర్కిల్
చూపు దెబ్బతిన్నదని మందులిచ్చిండ్రు..
కంటి చూపు మందగించడంతో ఐదారేండ్లుగా ఇబ్బంది పడుతున్నా. మొదటి విడుత కంటి వెలుగులో వైద్యులు పరీక్షించారు. కంటి చూపు దెబ్బతిన్నదని అవసరమైన మందులు ఇచ్చారు. పాయింటెడ్ అద్దాలు తయారు చేయించి, ఇంటికి వచ్చి అందజేశారు. కండ్లు మునుపటి కంటే చాలా బాగా కనబడుతున్నయ్. ఈ విడుతలో మళ్లీ పరీక్షలు చేయించుకుంట.
– ఈ. క్రాంతికుమారి, జయప్రకాశ్నగర్, మారేడ్పల్లి
చూపు మంచిగా అగుపడుతోంది
నాకు నాలుగేండ్ల కింద ఎడమ కన్ను కనిపించకపోతే కంటి వెలుగులో ఆపరేషన్ చేయించుకున్న. ఒక్క రూపాయి తీసుకోకుండా ప్రభుత్వమే చేయించింది. చూపు మంచిగా అగుపడుతోంది. ఇప్పుడు కుడి కన్నుకూడా కానొస్తలేదు. ఇప్పుడు మళ్లొకసారి కంటి వెలుగులో చూయించుకుంట.
– సీహెచ్. పేతూరు, జయప్రకాశ్నగర్, మారేడ్పల్లి
సీఎం కేసీఆర్ బాగుండాలి
కంటి చూపుతో బాధపడుతున్న అభాగ్యులకు ముఖ్యమంత్రి చూపును ప్రసాదిస్తున్నారు. వేలకువేలు డబ్బులు పోసి కంటి పరీక్షలు చేయించుకొనే స్థామత లేక గతంలో కంటి పరీక్షలు చేయించుకోలేదు. కంటి వెలుగు కార్యక్రమం ద్వారా ఉచితంగా కంటి పరీక్షలు చేయడం…వెంటనే కంటి అద్దాలు ఇవ్వడం బాగుంది. సీఎం కేసీఆర్ బాగుండాలని భగవంతుడిని కోరుతున్నా.
– గుత్తికొండ శాంతమ్మ, నాగార్జునగర్ నివాసి, బాలానగర్