Hyderabad Metro | సిటీబ్యూరో, మార్చి 3 (నమస్తే తెలంగాణ): రెండో దశ మెట్రో పనులు క్షేత్ర స్థాయిలో కొనసాగుతున్నాయి. హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ఆధ్వర్యంలో రెండు ప్రైవేటు కన్సల్టెన్సీలు 70 కి.మీ మేర ప్రతిపాదించిన మార్గాల్లో సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపకల్పనకు అవసరమైన పనులు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 7 మార్గాలను ప్రాథమికంగా ఖరారు చేయడంతో, ఆయా మార్గాల్లో ట్రాఫిక్ సర్వేతో పాటు భూ సార పరీక్షలను ఏక కాలంలో చేపట్టారు.
రెండు మూడు రోజులుగా మియాపూర్ నుంచి పటాన్చెరూ వరకు నిర్ణయించిన మార్గంలో రోడ్డు మధ్య డ్రిల్లింగ్ యంత్రాలతో నేల సామర్థ్యాన్ని పరీక్షిస్తున్నారు. హైదరాబాద్-ముంబై జాతీయ రహదారిపై ఉన్న చందానగర్, బీహెచ్ఈఎల్ ప్రాంతాల్లో పలు చోట్ల రోడ్డు మధ్యలో నేల స్వభావాన్ని తెలుసుకునేందుకు ఇంజినీరింగ్ అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే మొదటి దశలో మియాపూర్ వరకు మెట్రో కనెక్టివిటీ ఉండటంతో దానికి అనుసంధానంగా బీహెచ్ఈఎల్ మీదుగా పటాన్చెరూ వరకు సుమారు 8 కి.మీ మేర రెండో దశలో మెట్రో మార్గాన్ని నిర్మించనున్నారు.
ఈ మార్గంలో రోడ్డు విశాలంగా ఉండటంతో భూసేకరణ అవసరం లేకుండా మెట్రో వయాడక్ట్ను రోడ్డు మధ్యలోంచే నిర్మించేందుకు అనుకూలంగా ఉన్నదని మెట్రో ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. ఇదే తరహాలో మిగిలిన ప్రతిపాదిత కారిడార్లలో డీపీఆర్ రూపొందించేందుకు అవసరమైన పనులను క్షేత్ర స్థాయిలో నిర్వహిస్తున్నామని, రెండు నెలల్లో డీపీఆర్ను పూర్తి చేసి ప్రభుత్వానికి అందజేయనున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు.