మేడ్చల్ కలెక్టరేట్, మార్చి 4: జిల్లాలో జీఓ 58,59 దరఖాస్తుల పరిశీలన ఇప్పటికే పూర్తి చేశామని కలెక్టర్ అమోయ్ కుమార్ అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, పంచాయతీ, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో కలిసి కంటి వెలుగు, పట్టణ ప్రాంతాల్లో రెండు పడక గదుల నిర్మాణం, జీవో 58, 59,కింద ఇండ్ల స్థలాల క్రమబద్ధ్దీకరణ తదితర అంశాలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ అమోయ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. జీఓ 58, 59ల దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసినందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కలెక్టర్ను అభినందించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉత్తర్వు 118కి సంబంధించి ఆదివారం నాటికి పూర్తి చేసి లాగిన్ చేస్తామని తెలిపారు.ఈ వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు ఏనుగు నర్సింహా రెడ్డి, అభిషేక్ అగస్త్య, జిల్లా అటవీ శాఖ అధికారి జానకీరామ్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి శ్రీనివాస్, రోడ్లు, భవనాల శాఖ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసమూర్తి, మున్సిపల్ కమిషనర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.