జాగ్రత్తలు పాటించకపోతే ప్రాణాలకే ప్రమాదం
భానుడు భగభగమంటున్నాడు..తన ప్రతాపంతో గ్రేటర్లో నిప్పులవాన కురిపిస్తున్నాడు. ఉగాదికి ముందే మండిపోతుండడంతో బయటకెళ్లాలంటే దడ పుడుతోంది. బుధవారం గ్రేటర్లో గరిష్ఠం 40.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాగల ఐదు రోజులపాటు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉండడంతో అధికారులు ఎల్లో హెచ్చరికలు జారీచేశారు.
సిటీబ్యూరో, మార్చి 30 : భానుడు భగభగ మండుతున్నాడు. ఒంట్లో నీటినే కాదు.. సత్తువనూ పీల్చేస్తున్నాడు. అడుగు బయటపెట్టాలంటే ఠారెత్తించే ఎండ.. భరించలేనంత ఉక్కపోత.. చెప్పలేనంత నీరసంతో నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం నగరంలో 38డిగ్రీల సెల్సియస్పైనే ఉష్ణోగ్రత నమోదవుతున్నది. ఈ పరిస్థితుల్లో వేసవి నుంచి గట్టెక్కాలంటే జాగ్రత్తలు తప్పనిసరి.
నీటిని ఎక్కువగా తాగాలి
ప్రతీరోజు 4 లీటర్ల నీళ్లు కనీసంగా తీసుకోవాలి. ఎండ తీవ్రంగా ఉన్న సమయాల్లో బయటకు రాకపోవడమే మంచిది. ఆ సమయాల్లోని పనులు వాయిదావేసుకోవడం ఉత్తమం. శరీరాన్ని చల్లబరిచే పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. బయటకు వెళ్లాల్సి వస్తే కచ్చితంగా గొడుగు తీసుకెళ్లాలి. పిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లకూడదు. వేడిగాలులతో ఇంట్లో కూడా వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. పండ్ల రసాలు తరుచూ తీసుకోవడం ఉత్తమం.
జాగ్రత్తలు
గ్రేటర్కు ఎల్లో హెచ్చరికలు
మార్చి చివరిలోనే రికార్డు స్థాయిలో 40.2 డిగ్రీలు నమోదు
రాగల ఐదు రోజులు మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు
అత్యవసరమైతే తప్పా మధ్యాహ్నం బయటకు రావొద్దు
గ్రేటర్లో ఎండలు మండిపోతున్నాయి. మార్చి చివరిలోనే ఉష్ణోగ్రతలు 40 దాటడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నగరంలో బుధవారం రికార్డు స్థాయిలో మధ్యాహ్నం వరకే 40.2డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. రాగల మరో ఐదు రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలుండడంతో గ్రేటర్కు ఎల్లో హెచ్చరికలు జారీచేశారు. అత్యవసరమైతే తప్పా మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల్లోపు బయటకు వెళ్లకుండా ఉంటే మంచిదని సూచించారు.