సిటీబ్యూరో, ఆగస్టు 23(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహా నగర పారిశుద్ధ్య కార్మికులకు బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనతోనే భరోసా ఉంటున్నదని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. జీహెచ్ఎంసీ ఏడో సాధారణ సమావేశం బుధవారం మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన సజావుగా సాగింది. తొలుత మేయర్ విజయలక్ష్మి సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కౌన్సిల్ సమావేశం అర్థవంతమైన చర్చలు, అధికారులు పూర్తి స్థాయిలో సమాధానం ఇచ్చే విధంగా సభ్యులు సహాయ సహకారాలు అందించాలని మేయర్ కోరారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఆశించకుండా ప్రజల సమస్యల పట్ల కౌన్సిల్ దృష్టికి తేవాలని కోరారు. సభ్యులు తమ అమూల్యమైన సమయాన్ని ప్రజల కోసం వినియోగించుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతున్నదని మేయర్ తెలిపారు. పురపాలక, పట్టణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మార్గదర్శకత్వంలో నగరంలో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు విశేషంగా కృషి చేస్తున్నారని మేయర్ పేర్కొన్నారు.
కార్మికుల క్రమబద్ధీకరణ ప్రభుత్వం దృష్టికి..
కౌన్సిల్ ప్రశ్నోత్తరాల సమయంలో లింక్, మిస్సింగ్ రోడ్లపై చర్చ జరుగుతుండగా కాంగ్రెస్ కార్పొరేటర్లు శానిటేషన్ కార్మికులను పర్మినెంట్ చేయాలని కోరారు. దాంతో మేయర్ పార్టీకి ఒకరి చొప్పున ఈ విషయంపై మాట్లాడాలని సభ్యులను కోరారు. బీజేపీ కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, ఎంఐఎం నుంచి సలీం బేగ్ మాట్లాడారు. శానిటేషన్ కార్మికులను పర్మినెంట్ చేయాలని అన్ని పార్టీలు సమర్ధించాయి. మానవతా దృక్పథంతో శానిటేషన్ వరర్ల పర్మినెంట్ గురించి సానుకూలమైన నిర్ణయం తీసుకుంటున్నదని, ఈ విషయంపై కమిషనర్ మాట్లాడాలని మేయర్ కోరగా, ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడారు. ఈ సమావేశంలో చర్చించిన విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని కమిషనర్ సభ్యులకు తెలిపారు.
ఈ సమావేశంలో కమిషనర్ రోనాల్డ్ రోస్, ఈఎన్సీ జియా ఉద్దీన్, అడిషనల్ కమిషనర్లు స్నేహ శబరీష్, జయరాజ్ కెనడి, విజయలక్ష్మి, చంద్రారెడ్డి, కృష్ణ, ఉపేందర్ రెడ్డి, ప్రాజెక్ట్ సీఈ దేవా నంద్, సీసీపీ రాజేంద్ర ప్రసాద్ నాయక్, హౌసింగ్ ఓఎస్డీ సురేష్ కుమార్, జోనల్ కమిషనర్లు వెంకటేష్ దోత్రె, రవికిరణ్, పంకజ, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రహదారులు, వంతెనలు
కౌన్సిల్ సమావేశంలో సీతాఫల్ మండి కార్పొరేటర్ సామల హేమ తెలంగాణ ఏర్పడ్డాక స్లిప్, మిస్సింగ్, ఎస్ఆర్డీపీ, సీఆర్ఎంపీ రోడ్లు ఏర్పాటు చేశారన్న ప్రశ్నపై ప్రాజెక్ట్ సీఈ దేవానంద్ సమాధానం ఇచ్చారు. మిస్సింగ్ లింక్ ప్రాజెక్ట్ మొదటి దశలో రూ.275.53 కోట్ల వ్యయంతో 22 పనులు చేపట్టగా, 24.301 కిలోమీటర్ల పొడవు రోడ్లు పూర్తి చేయడం జరిగిందన్నారు. రెండో దశలో రూ.216.79 కోట్ల వ్యయంతో 20.57 కిలోమీటర్ల పొడవు చేపట్టేందుకు 13 పనులు వివిధ ప్రగతి దశలో ఉన్నాయని తెలిపారు. మూడో దశలో రూ.2410 కోట్ల అంచనా వ్యయంతో పరిపాలన అనుమతి లభించిందని, అందులో రూ.1500 కోట్లతో 50 ప్రాధాన్యత రోడ్లను ప్రభుత్వం చేపట్టేందుకు అనుమతి ఇచ్చిందని తెలిపారు. ఎస్ఆర్డీపీతో 48 పనులలో 36 పనులు పూర్తయ్యాయని, ఇంకా 12 పనులు కొనసాగుతున్నట్లు తెలిపారు. మిగతా పనులు ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేస్తామని తెలిపారు. ఈఎన్సీ జియా ఉద్దీన్ మాట్లాడుతూ, సీఆర్ఎంపీ ద్వారా 812 కిలోమీటర్ల పొడవు రోడ్డును ఏడు ప్యాకేజీలుగా చేపట్టడం జరిగినదని, అందులో 777.77 కిలోమీటర్ల రోడ్డును రీ కార్పెటింగ్ చేయడం జరిగిందని తెలిపారు. అంతే, కాకుండా 103 కిలోమీటర్ల పొడవు ఫుట్ పాత్ నిర్మించినట్టు తెలిపారు.
ఎస్ఎన్డీపీ పథకం
రహమత్ నగర్ కార్పొరేటర్ సీఎన్రెడ్డి ఎస్ఎన్డీపీ పనుల పరిస్థితి, వర్షాకాలంలో ఎదుర్కొన్న సమస్యలను వివరించాలని కోరగా, ఈఎన్సీ జియా ఉద్దీన్ సమాధానం ఇచ్చారు. నగరంలో వరదల నష్టాన్ని వివరించేందుకు ఎస్ఎన్డీపీ కార్యక్రమాన్ని రూ.985 కోట్ల వ్యయంతో జీహెచ్ఎంసీ దాని చుట్టూ ఉన్న మున్సిపాలిటీలలో 57 పనులను చేపట్టడం జరిగిందని, జీహెచ్ఎంసీ పరిధిలో రూ.734 కోట్లతో 35 పనులు చేపట్టామన్నారు. ఇప్పటి వరకు 25 పనులు పూర్తయ్యాయని, 5 పనులు త్వరలో పూర్తి అవుతాయని, మిగతా పనులు వివిధ సమస్యలతో ప్రారంభ సమయంలో జాప్యం జరిగిందని తెలిపారు. ఈ వర్షాకాలంలో ఎస్ఎన్డీపీ ద్వారా చేపట్టిన పనుల మూలంగా 150 కాలనీలు వరద ముంపు లేకుండా చేయడమే కాకుండా 6,50,000 మంది ప్రయోజనం పొందారని, రెండో దశ ఎస్ఎన్డీపీ కార్యక్రమం రూ.2,141 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడం జరిగిందని తెలిపారు.
వీధి దీపాల నిర్లక్ష్యంపై రూ.6.50 కోట్ల జరిమానా
పత్తర్ గట్టి కార్పొరేటర్ సోహెల్ ఖాద్రీ పాత బస్తీలోని చార్మినార్ పర్యాటక ప్రాంతంలో సుందరీకరణ, ఆధునిక విద్యుత్ దీపాల ఏర్పాటుపై అడిగిన ప్రశ్నకు కమిషనర్ రోనాల్డ్ రోస్ కులీ కుతుబ్ షా డెవలప్మెంట్ అథారిటీ ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, ప్రభుత్వం నుంచి వెంటనే పనులు ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. స్ట్రీట్ లైట్ పై మేయర్ మాట్లాడారు. వీధి లైట్లను మెరుగుపరిచేందుకు కమిషనర్ స్టాండింగ్ కమిటీ సభ్యులతో అనేక సార్లు ఈఈఎస్ఎల్ సంస్థ ప్రతినిధులతో సమీక్షించడం జరిగిందన్నారు. కొందరు సభ్యులు పోల్స్ ఇవ్వడానికి ఆరు నెలలు పడుతుందని, వీధిలైట్ల కింద ఉన్న చెట్ల కొమ్మలను తొలగించేందుకు ఎవరు చర్యలు తీసుకుంటారో తెలియడం లేదని పలువురు వచ్చిన కార్పొరేటర్లు సభా దృష్టికి తీసుకురావడంతో కమిషనర్ రోనాల్డ్ రోస్ మాట్లాడారు. వీధి లైట్లను మెరుగుపరచడంలో పాటు పిన్ పాయింట్ ప్రోగ్రామ్ను ఏర్పాటు చేశామని, కార్పొరేటర్ ఆధ్వర్యంలో అధికారులు ఆయా ప్రాంతాలను పర్యటించి చర్యలు తీసుకుంటారని తెలిపారు.