గాజులరామారం, నవంబర్ 10: వేగంగా దూసుకొచ్చిన ఆటో అదుపుతప్పి పారిశుధ్య కార్మికుడిని ఢీ కొట్టింది. దీంతో ఆ కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. జగద్గిరిగుట్ట పోలీసుల కథనం ప్రకారం.. జగద్గిరిగుట్ట పైపులైన్ రోడ్డులో గురువారం ఉదయం పారిశుధ్య కార్మికుడు నర్సింహ (40) డ్యూటీలో ఉన్నాడు. ఆ సమయంలో అతి వేగంతో దూసుకొచ్చిన ఓ ఆటో నర్సింహను ఢీకొనడంతో గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి, దర్యాప్తు చేపట్టారు. పోలీసులు ఆటో డ్రైవర్ను ఆదుపులోకి తీసుకున్నారు.