హయత్నగర్, అక్టోబర్ 8 : ఆటోనగర్ ఇసుక లారీల అడ్డాను తరలించడం వల్ల చుట్టుపక్కల కాలనీల ప్రజలకు సంపూర్ణమైన విముక్తి లభించిందని ఎంఆర్డీసీఎల్ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. ఆదివారం హయత్నగర్ డివిజన్లోని హైకోర్టు కాలనీ కమ్యూనిటీ హాల్లో వనస్థలిపురం తూర్పు కాలనీల అసోసియేషన్ ఆధ్వర్యంలో అభినందన సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి హాజరై ప్రసంగించారు. 22 కాలనీల ప్రజల పట్టుదలతో ఇసుక లారీల అడ్డాను ఇక్కడి నుంచి తరలించామని తెలిపారు. లారీల యజమానులు, వారి అసోసియేషన్, ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసు ఉన్నతాధికారులు, ఆర్టీఏ, ఆర్అండ్బీ అధికారుల సమన్వయంతోనే ఇసుక లారీల అడ్డా తరలింపు సాధ్యమైందన్నారు. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో టీఎస్ఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ ఎం.నర్సింహారెడ్డి సహకారంతో ఆటోనగర్లో ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించి స్థానికుల సమస్యను పరిష్కరించారని కొనియాడారు.
ఎల్బీనగర్ అభివృద్ధిపై చర్చకు సిద్ధం
ఇప్పటి వరకు రూ.3718 కోట్లతో ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని, దీనిపై చర్చించేందుకు తాను సిద్ధమని ప్రతిపక్ష నాయకులకు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి సవాల్ విసిరారు. రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా అత్యాధునిక పార్కులు, శ్మశాన వాటిక, స్విమ్మింగ్ పూల్లు, బస్ టెర్మినల్స్ ఎల్బీనగర్కు తీసుకొచ్చామని తెలిపారు. ఎన్నికల అనంతరం నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు, ఎల్బీనగర్ నుంచి హయత్నగర్ వరకు మెట్రోరైలు పొడిగించనున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ నగరం అభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందని, సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో తొమ్మిదేళ్లుగా ఎలాంటి శాంతిభద్రతలకు విఘాతం వాటిల్లలేదని స్పష్టంచేశారు. పారాచూట్ నాయకుల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని, రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్కు మరోసారి అవకాశమిచ్చి అతిభారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు సామ తిరుమలరెడ్డి, కొప్పుల విఠల్రెడ్డి, బీఆర్ఎస్ హయత్నగర్ డివిజన్ అధ్యక్షుడు చెన్నగోని శ్రీధర్గౌడ్, ఉపాధ్యక్షుడు ఏర్పుల దేవ ప్రసన్నకుమార్, జక్కిడి మల్లారెడ్డి, భాస్కర్ సాగర్, ఈస్టర్న్ కాలనీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు దీపావళి శ్రావణ్కుమార్, జాయింట్ సెక్రటరీ లక్ష్మణ్రెడ్డి, కోశాధికారి బాదం శ్రీనివాసులు, గౌరవ అధ్యక్షుడు సదర్శన్రెడ్డి, నరసింహారావు, ఉపాధ్యక్షులు మధుసూదన్రెడ్డి, సుధాకర్రెడ్డి, భరత్సింగ్, జాయింట్ సెక్రటరీ సుధీర్రెడ్డి, దీపావళి శ్రీకాంత్, జలెందర్, ప్రవీణ్ గౌడ్, చంద్రశేఖర్రెడ్డి, సునీల్ కుమార్, మాదవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.