న్యూఢిల్లీ, మార్చి 14: హామీల అమలులో కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ డిమాండ్ల సాధనకు తిరిగి పోరుబాట పడతామని ప్రకటించింది. దశల వారీగా దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. గతేడాది డిసెంబర్లో రైతాంగ ఆందోళనల విరమణ సమయంలో కేంద్రం ఇచ్చిన హామీల అమలుపై ఎస్కేఎం సోమవారం సమీక్షించింది. ఢిల్లీలోని గాంధీ పీస్ ఫౌండేషన్ భవనంలో నేతలు అంతర్గత సమావేశం నిర్వహించారు. ఎంఎస్పీకి చట్టబద్ధత, రైతులపై కేసుల ఉపసంహరణతో పాటు రైతులకు ఇచ్చిన పలు హామీల అమలులో మోసం, లఖింపూర్ ఘటనలో ప్రభుత్వ పాత్రపై ఈనెల 21న బ్లాక్, జిల్లా స్థాయిలో దేశవ్యాప్త నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్టు ఎస్కేఎం నేత అభిమన్యు కోహర్ తెలిపారు. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కి వెంటనే చట్టబద్ధత కల్పించాలన్న డిమాండ్తో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఏప్రిల్ 11 నుంచి 17 వరకు ’ఎంఎస్పీ గ్యారంటీ వీక్’ పేరిట దేశవ్యాప్తంగా ప్రచారం, ఆందోళనలు చేపడుతామని ఎస్కేఎం తెలిపింది. రైతాంగ ఉద్యమం నేపథ్యంలో వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకుంటున్నట్టు ప్రకటించిన మోదీ సర్కార్.. ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించడంతో పాటు రైతులపై నమోదైన కేసుల ఉపసంహరణ, అమరులైన రైతు కుటుంబాలకు పరిహారం వంటి రైతు ఆరు డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను క్యాబినెట్ నుంచి తొలగించాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. కానీ దాదాపు మూడు నెలలు గడిచినా వీటిపై అడుగు ముందుకు పడకపోవడంతో అన్నదాతలు మళ్లీ నిరసనలకు సమాయత్తమవుతున్నారు.