రంగారెడ్డి, డిసెంబర్ 3(నమస్తే తెలంగాణ) : ‘అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ జోరు కొనసాగింది. 8 అసెంబ్లీ స్థానాలకు గాను.. 5 చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులకు ప్రజానీకం పట్టం కట్టింది. మిగిలిన మూడు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. మహేశ్వరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రతి ఎన్నికల్లోనూ విజయం సాధిస్తూ.. తాజాగా ఐదోసారి విజయాన్ని కైవసం చేసుకున్నారు. గెలిచిన మిగతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సైతం మూడు, నాలుగుసార్లు ఎమ్మెల్యే పదవి వరించింది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీచినప్పటికీ.. రంగారెడ్డి జిల్లాలో మెజార్టీ అభ్యర్థులు గెలవడంతో బీఆర్ఎస్ పార్టీ జిల్లాలో పట్టును నిలుపుకొంది..’
అంతా గెలుపు వీరులే..
మహేశ్వరం ఎమ్మెల్యేగా గెలుపొందిన సబితా ఇంద్రారెడ్డి.. ఎమ్మెల్యేగా గెలుపొందడం ఇది ఐదోసారి. 2000లో జరిగిన ఉప ఎన్నికల్లో, 2004లో జరిగిన ఎన్నికల్లో ఆమె చేవెళ్ల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత మహేశ్వరం నియోజకవర్గం నుంచి 2009, 2018 ఎన్నికల్లో గెలుపొందిన ఆమె.. అదే స్థానం నుంచి ఈసారి కూడా విజయాన్ని సొంతం చేసుకున్నారు. చేవెళ్ల నుంచి గెలుపొందిన కాలే యాదయ్య వరుసగా 2014, 2018, 2023 ఎన్నికల్లో గెలుస్తూ వచ్చి.. ఈసారి హ్యాట్రిక్ కొట్టారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యేగా ఈ ఎన్నికల్లో గెలుపొందిన దేవినేని సుధీర్రెడ్డి 2009, 2018లో ఎమ్మెల్యేగా గెలిచి.. ఈసారి ఎన్నికల్లోనూ గెలవడం ద్వారా హ్యాట్రిక్ సాధించారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ వరుసగా 2014, 2018 ఎన్నికల్లో గెలుస్తూ.. ఈసారి ఎన్నికల్లోనూ విజయ ఢంకా మోగించి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నిలిచారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ 2009, 2014, 2018 ఎన్నికల్లో విజయాన్ని కైవసం చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
మూడు చోట్ల కాంగ్రెస్ గెలుపు ..
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి మల్రెడ్డి రంగారెడ్డి గెలుపొందారు. 1994, 2004 ఎన్నికల్లో గెలుపొందిన ఈయన ఆ తర్వాత 2009, 2014, 2018 ఎన్నికల్లో వరుసగా ఓటమి పాలవుతూ వచ్చారు. షాద్నగర్ ఎమ్మెల్యేగా గెలుపొందిన కె.శంకరయ్య గత పర్యాయం బీఎస్పీ పార్టీ నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఈసారి కాంగ్రెస్ అధిష్టానం శంకరయ్యకు టికెట్ ఇవ్వగా.. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందిన కసిరెడ్డి నారాయణ రెడ్డి 2014 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2016లో ఎమ్మెల్సీగా గెలుపొందారు. 2023 ఎన్నికల్లో మొదటిసారిగా ఆయనను ఎమ్మెల్యే పదవి వరించింది.