ఆర్కేపురం, నవంబర్ 6 : ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం ముందుకు సాగాలని, అలా కాకుండా పేద ప్రజల ఇండ్ల మీదకు బుల్డోజర్లు పంపించి కూల్చివేయడం చాలా దారుణమని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు. సీఎం రేవంత్రెడ్డి చేయబోయే పాదయాత్ర నల్లగొండ నుంచి కాకుండా హైదరాబాద్లోని మూసీ పక్క నుంచి చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం సరూర్నగర్ తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి హాజరై ఆర్కేపురం, సరూర్నగర్ డివిజన్లకు చెందిన 54 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ… కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా లక్ష రూపాయల చెక్కుతో పాటు తులం బంగారం ఇచ్చి.. కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలన్నారు. ఆడబిడ్డకు ఆసరా ఉంటుందనే ఉద్దేశంతోనే అప్పటి సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను తీసుకొచ్చారన్నారు. ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం 11నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు అమలు చేయలేదని విమర్శించారు.
గత ప్రభుత్వంలో కేసీఆర్ తీసుకొచ్చిన కేసీఆర్ కిట్టు,న్యూట్రిషన్ కిట్టు ఆపకుండా ఇవ్వాలన్నారు. రూ.44లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయాల్సి ఉంటే 22లక్షల మంది రైతులకు చేసి అందరికి చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. ప్రస్తుతం చేస్తున్న కుల గణన పారదర్శకంగా చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం బీఆర్ఎస్ హయాంలో సరూర్నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్మించిన నూతన భవనాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రాధాధీరజ్రెడ్డి, తహసీల్దార్ వేణుగోపాల్, డిప్యూటీ తహసీల్దార్ జంగయ్య, మహేశ్వరం నియోజకవర్గ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి అరవింద్శర్మ, ఆర్కేపురం డివిజన్ అధ్యక్షుడు నగేశ్, నియోజకవర్గ యూత్వింగ్ మాజీ అధ్యక్షుడు కొండల్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, ఎం.ఏ,సాజీద్, రామ్నర్సింహా, పెంబర్తి శ్రీనివాస్, రాజేశ్ గౌడ్, శేఖర్, రమేశ్ కురుమ, స్వప్నారెడ్డి, రిషి పాల్గొన్నారు.