తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం పల్లె ప్రగతి దినోత్సవం మహేశ్వరం నియోజకవర్గంలో ఊరూరా ఉత్సాహంగా సాగింది. బతుకమ్మలు, బోనాలతో ర్యాలీలు తీసి హోరెత్తించారు. ప్రతి గ్రామంలో ప్రజాప్రతినిధులు, సర్పంచ్లు జాతీయ జెండాలు ఆవిష్కరించారు. ‘పల్లె ప్రగతి’తో గ్రామాల్లో సాధించిన అభివృద్ధిపై ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఆయా గ్రామ పంచాయతీల కార్మికులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందించి, ఘనంగా సన్మానించారు.
మహేశ్వరం/కందుకూరు, జూన్ 15: పల్లె ప్రగతితోనే గ్రామాలు, మండలాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని ఎంపీపీ రఘుమారెడ్డి అన్నారు. గురువారం దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న పల్లెప్రగతి కార్యక్రమంలో మహేశ్వరం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల వద్ద పండుగ వాతావరణంలో పల్లె ప్రగతి కార్యక్రమాలను ఆయా గ్రామాల సర్పంచ్ల ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం గ్రామ సభలను నిర్వహించి పారిశుధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ.. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఇతర రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని అన్నారు. తెలంగాణలో ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు రాజకీయాలకు అతీతంగా ప్రతి గడపకూ లబ్ధి చేకూరుతున్నాయని అన్నారు. పేదల సంక్షేమానికి, తెలంగాణ రాష్ర్టాభివృద్ధికి సీఎం కేసీఆర్ అహర్నిషలు కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆనందం, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కరోళ్ల చంద్రయ్య ముదిరాజ్, మాజీ ఉపసర్పంచ్ దోమ శ్రీనివాస్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి వజ్రలింగం, వార్డు సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ ముందు చూపుతో..
సీఎం కేసీఆర్ ముందుచూపుతో ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో పల్లె దశ మారిందని జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని 35గ్రామాల్లో ఆయా గ్రామ పంచాయతీ సర్పంచ్లు, అధికారులతో గ్రామ పంచాయతీ కార్యలయల వద్ద జాతీయ జెండాలను ఎగురవేసి గౌరవ వందనాన్ని స్వీకరించారు. పంచాయతీ సిబ్బందిని సన్మానించి.. అవార్డులు అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సురుసాని సురేందర్రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సురుసాని రాజశేఖర్రెడ్డి, సర్పంచ్ సురుసాని శమంతకమణి, వార్డు మెంబర్లు, తాళ్ల కార్తీక్, దేశం మోహన్రెడ్డి, రాంరెడ్డి, పూజితాప్రశాంత్ చారి, సుధాకర్రెడ్డి, రమాకాంత్రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ బొక్క దీక్షిత్రెడ్డి, ఆశావర్కర్లు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. బాచుపల్లి గ్రామంలో నేదునూరు కెనరా బ్యాంక్ శాఖ డ్వాక్రా మహిళలకు ఇచ్చిన రూ.10లక్షలు సర్పంచ్ యాలాల శ్రీనివాస్ అందజేశారు. పంచాయతీ కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు.