సిటీబ్యూరో, మే 13 (నమస్తే తెలంగాణ) : నగరంలో ఆర్టీసీ బస్సులకు సంబంధించి మెరుగైన సేవలు ప్రజల అందుబాటులోకి తీసుకువెళ్లడం కోసం ఆర్టీసీ యాజమాన్యం నిరంతరం కృషి చేస్తున్నది. ఆర్టీసీ అభివృద్ధి కోసం కొత్త పథకాలు, విధానాలను ప్రవేశ పెడుతుంది. ముఖ్యంగా నగర ప్రయాణికుల కోసం టీ-24, టీ-6, వంటి రోజు వారీ టికెట్లో రాయితీలు ప్రకటిస్తూ.. క్రమంగా ఆదాయం పెంచుకుంటున్న ఆర్టీసీ గ్రేటర్ జోన్ కొత్తగా ‘విలేజ్ బస్ ఆఫీసర్ల వ్యవస్థకు తెరలేపింది.
ఈ విధానం ద్వారా ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రయాణికులకు ఆర్టీసీ బస్సుల గురించి ప్రచారం చేయడం, ఆర్టీసీ బస్సుల ప్రాముఖ్యత గురించి వివరించడంతో పాటు వాటి ప్రయోజనాలను స్థానిక ప్రజలు వివరిస్తున్నారు. అందుకోసం త్వరలోనే విలేజ్ బస్ ఆఫీసర్లను నియమించడానికి ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. గ్రామాల వారీగా ఈ వ్యవస్థ సేవలు అందిస్తుంది. ఆ మేరకు నగరంలోని అమీర్పేట్, ఉప్పల్, కూకట్పల్లి, మీర్పేట్, బోయినపల్లి, మేడ్చల్..ఇలా ఒక్కో ప్రాంతానికి ఒక్కొక్క సహాయకున్ని నియమిస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.
ఆర్టీసీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలనుకునే వారు, ఆర్టీసీ ఆదాయాన్ని మెరుగు పరుచుకోవడం కోసం, ప్రాంతాల వారీగా ఏర్పాటు చేసిన సిటీ బస్సుల సర్వీసులు, సమయాలు, టికెట్ ఛార్జీలు, ప్రయోజనాలు గురించి స్థానిక ప్రజలకు తెలియజేయడంతో పాటు పెండ్లిండ్లకు, యాత్రలకు, ఇతర శుభకార్యాలయాలకు ప్రత్యేక బస్సులు ప్రయాణికులు బుక్ చేసుకునే విధంగా విలేజ్ అసిస్టెంట్ వ్యవస్థ సహాయపడుతుందని అధికారులు భావిస్తున్నారు. అలాగే కార్గో పార్సిల్ సర్వీసుల వివరాలు కూడా ఈ వ్యవస్థలో ప్రజలకు తెలియచేస్తుంది. అయితే ప్రస్తుతం కండక్టర్లుగా, డ్రైవర్లుగా, ఇతర విభాగాలలో విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ సిబ్బంది రెగ్యులర్ ఉద్యోగంతో పాటు అదనంగా ఈ సర్వీసులు నిర్వహించాల్సి ఉంటుంది. అందుకోసం ఆర్టీసీ ఉద్యోగులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చినట్లయితే వారికి కొంత మొత్తం గౌరవ వేతనం ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.