సిటీబ్యూరో, జూన్ 23 ( నమస్తే తెలంగాణ ) : నిబంధనలకు విరుద్ధంగా నడస్తున్న విద్యాసంస్థల బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరఢా ఝుళిపిస్తున్నారు. విద్యార్థుల సురక్షిత ప్రయాణమే లక్ష్యంగా సాగుతున్న రవాణా శాఖ అధికారుల తనిఖీల్లో 15 స్కూల్ బస్సులను రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ పరిధిలో శుక్రవారం సీజ్ చేశారు. ఫిట్నెస్ లేకుండానే బస్సులు రోడ్డెక్కితే కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు. ఫిట్నెస్ సర్టిఫికెట్, అర్హత గల డ్రైవర్, విద్యాసంస్థల బస్సులో ఉండాల్సిన నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందేనని సూచించారు. ఉప్పల్, అత్తాపూర్, ఇబ్రహీంపట్నం, ఖైరతాబాద్ ప్రాంతాల్లో తనిఖీలు చేసిన అధికారులు కొన్ని బస్సులకు జరిమానాలు విధించారు.
ప్రతీ బస్సు ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవాలని విద్యా సంస్థలకు ఆర్టీఏ అధికారులు సూచనలు చేశారు. డొక్కు బస్సులకు రంగులు వేసి.. ఫిట్నెస్ లేకున్నా.. స్కూల్ బస్సులుగా నడిపితే కఠిన చర్యలు ఉంటాయని ఆర్టీఏ హెచ్చరించింది. ప్రమాదం జరగకముందే విద్యాసంస్థల యాజమాన్యాలు మేల్కోవాల్సిన అవసరం ఉందని ఆర్టీఏ అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థులను ఇంటికి.. విద్యాలయానికి చేరవేసే బస్సులు పూర్తిస్థాయిలో ఆర్టీఏ అధికారుల నుంచి అనుమతి పొందాలని వెల్లడించారు. బస్సులు, ఆటోలను తనిఖీలు చేయాలని రవాణా శాఖ క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలిచ్చింది. వాహన ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. అదేవిధంగా.. ఫిట్నెస్, స్పీడ్ గవర్నర్ (వేగ నియంత్రణ పరికరాలు) పరికరాలు ఉన్నాయా.? లేదా.? పరిశీలించేందుకు ఈ తనిఖీలు చేస్తున్నారు.