వనస్థలిపురం: శ్రీ చైతన్య స్కూల్ వ్యాన్ ఘటన నేపథ్యంలో ఆర్టీఏ అధికారులు హైదరాబాద్ (Hyderabad) వ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. నగరంలో నిబంధనలకు విరుద్ధంగా రాకపోకలు సాగిస్తున్న విద్యాసంస్థల బస్సులను తనిఖీ చేస్తున్నారు. ఇందులో భాగంగా వనస్థలిపురం వద్ద మన్నెగూడ ఆర్టీఏ అధికారులు స్కూల్, కాలేజీ బస్సులను తనిఖీ చేశారు. ఈ క్రమంలో సరైన పత్రాలు లేని 10 స్కూల్ వ్యాన్లు, బస్సులను సీజ్ చేశారు. వాహనాలు ఫిట్నెస్ లేకపోవడం, నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలను వాడటం, రోడ్డు నిబంధనలపై డ్రైవర్లకు అవగాహన లేకపోవడం, పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించడం తదితర కారణాలను అధికారులు గుర్తించారు.
ఇందులో ప్రముఖ స్కూళ్లకు చెందిన బస్సులు కూడా ఉన్నాయి. భాష్యం, శ్రీ చైతన్య, ఆదిత్య, నారాయణ బస్సులు సీజయ్యాయి. పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించడం ప్రమాదకరమని తెలిసినా యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆర్టీఏ అధికారులు తెలిపారు. ఈ స్పెషల్ డ్రైవ్లో మన్నెగూడ ఆర్టీవో సుభాష్ చంద్ర రెడ్డి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మున్ని తదితర అధికారులు పాల్గొన్నారు.
స్కూల్ వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ విద్యార్థిని మృతిచెందింది. మరో విద్యార్థినికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ హృదయ విదారక సంఘటన హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా, చిన్నంబావి మండలం, అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన బొబ్బిలిగామ నర్సింహ, శ్రీలత దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి అబ్దుల్లాపూర్మెట్ మండలం, పెద్దఅంబర్పేట మున్సిపాలిటీ, హనుమాన్ హిల్స్లో నివాసముంటున్నారు. నర్సింహ స్థానికంగా లారీ మెకానిక్ పనులు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు.
హయత్నగర్లోని శ్రీచైతన్య స్కూల్లో ఆయన పెద్ద కుమార్తె అనన్య(6) ఎల్కేజీ, చిన్న కుమార్తె రిత్విక(4) నర్సరీ చదువుతున్నారు. రోజూ మాదిరిగానే వారు స్కూల్ వ్యాన్ నెం.(టీఎస్ 18 టీ 1071)లో బడికి వెళ్లారు. సాయంత్రం స్కూల్ ముగియగానే స్కూల్ వ్యానులో ఇంటికి చేరుకున్న విద్యార్థినులను డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా రివర్స్ తీసే క్రమంలో ఢీకొట్టాడు. రిత్విక కిందపడడంతో టైరు తలపైనుండి వెళ్లింది. అనన్య ఎగిరిపడడంతో స్వల్పంగా గాయపడింది. వెంటనే తేరుకున్న స్థానికులు రిత్వికను హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. బాలికను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లుగా నిర్ధారించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.