సిటీబ్యూరో: ప్రైవేటు బస్సులు, పర్యాటక, స్కూల్ బస్సుల్లో 45 నుంచి 65 కిలోమీటర్ల వరకు వేగ పరిమితి ఉండేలా స్పీడ్ గవర్నెన్స్ బిగింపుపై ఆర్టీఏ దృష్టి సారించింది. సాధారణంగా రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం మితిమీరిన వేగమేనని తెలిసినా.. ఆ వేగ నియంత్రణకు రవాణాశాఖ అధికారులు తీసుకుంటున్న కఠిన చర్యలు ఎక్కడ కనిపించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా, రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా రవాణాశాఖ గతంలో ప్రతి ఏటా సఫర్ (సెఫ్టీ అల్వెస్ ఫర్ ఆల్ రోడ్స్) కార్యక్రమాన్ని తెరపైకి తెచ్చింది.
జనవరి మొదటి వారంలో రోడ్డు భదత్రా వారోత్సవాలు పేరిట రోడ్డు భద్రత అవగాహన శిబిరాలు, వేగ నియంత్రణ కార్యక్రమం, డ్రైవర్లకు శిక్షణా తరగతులను నిర్వహించి ప్రయాణికుల్లో, వాహనదారుల్లో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడమే ఈ సఫర్ ఉద్దేశం. కానీ ఈ సఫర్ లక్ష్యం నత్తనడకన సాగుతున్నది. ఇదిలా ఉంటే నగరంలోకి ప్రవేశించే వాహనాలను తనిఖీ చేసేందుకు రవాణాశాఖ కొన్ని చోట్ల చెక్పోస్టులను ఏర్పాటు చేసింది. ఒకే నంబరుతో నాలుగైదు వాహనాలు తిరుగుతున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. వీటిపై అధికారులు దృష్టి సారించారు. ఆ వాహనాల వేగ నియంత్రణపై చర్యలు తీసుకుంటున్నట్టు ఆర్టీఏ అధికారులు తెలిపారు.