ఆదిబట్ల, జూలై 5: వాహనాలకు సంబంధించిన నకిలీ పత్రాలు తయారు చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న ఆరుగురు సభ్యులు ఉన్న నకిలీ ఆర్టీఏ ఏజెంట్ల ముఠాను ఎల్బీనగర్ ఎస్ఓటీ, ఆదిబట్ల పోలీసులు కలిసి అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. ఆదిబట్ల ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. హస్తినాపురం నివాసి సంగిరెడ్డి రాఘవేందర్రెడ్డి, బ్రాహ్మణపల్లికి చెందిన కొంగల ఆనంద్, మన్నెగూడకు చెందిన వేణు, ఇబ్రహీంపట్నం నివాసి పుట్టబత్తిని శ్రీధర్, కమ్మగూడకు చెందిన అనుపాటి శ్రీశైలం, బ్రాహ్మణపల్లికి చెందిన చాపల యాదగిరి కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. మన్నెగూడ ఆర్టీఏ కార్యాలయం వద్ద ప్రైవేట్ ఆర్టీఏ ఏజెంట్లుగా పనిచేస్తున్నారు. ఆర్టీఏ కార్యాలయం పక్కన లక్షిత పేరుతో జిరాక్స్ సెంటర్ను ఏర్పాటు చేసుకున్నారు. అందులో కంప్యూటర్లు ఏర్పాటు చేసి రవాణా రహిత వాహనాలకు సంబంధించిన నకిలీ బీమా సర్టిఫికెట్లు తయారు చేసి, అవసరమైన వారికి ఇచ్చి వారినుంచి భారీ మొత్తంలో వసూలు చేస్తున్నారు.
వాహన యజమానులకు వాహన ఫిట్నెస్ సర్టిఫికెట్లు, యాజమాన్యాల బదిలీ, నకిలీ ఆర్సీ పొందడానికి నకిలీ బీమా సర్టిఫికెట్లు, నకిలీ ఆధార్ కార్డులు, పోలీస్ మిస్సింగ్ (లాస్)సర్టిఫికెట్లు, వాహన సర్టిఫికెట్లు, బ్యాంక్ ఎన్ఓసీ సర్టిఫికెట్లు తయారు చేసి.. వాటిని స్కాన్చేసి, కలర్ ప్రింట్స్ తీసి అవసరమైన వాహనాల యజమానులకు ఇచ్చి ప్రతి సర్టిఫికెట్కు రెండువేల నుంచి రూ. 10వేల వరకు వసూలు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు, ఆదిబట్ల పోలీసులు కలిసి నకిలీ పత్రాలు తయారు చేస్తున్న ఈ ముఠాను అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో పలు విషయాలు బయటపడ్డాయి. ఈ ముఠా గతంలో కూడా నకిలీ పత్రాలు తయారు చేసినట్లు తేలింది. ఈ ముఠా నుంచి నకిలీ బీమా సర్టిఫికెట్లు, నకిలీ పోలీసులు జారీ చేసే మిస్సింగ్ (లాస్) సర్టిఫికెట్లు, నకిలీ వాహన ఫిట్నెస్ సర్టిఫికెట్లు, వాహనాల వేగపరిమితి నకిలీ సర్టిఫికెట్లు, నకిలీ బ్యాంక్ ఎస్ఓసీ సర్టిఫికెట్లు, నకిలీ ఆధార్కార్డులు, నకిలీ గ్యాస్ బిల్లులు, మూడు కంప్యూటర్ సెట్ సీపీయూ, మానిటర్లు, కీ బోర్డులు, మౌస్, పెన్డ్రైవ్లు, ల్యాప్టాప్, మొబైల్ఫోన్లు, నగదు రూ.18,110 స్వాధీనం చేసుకొని నిందితులను అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. ఈ సమావేశంలో మహేశ్వరం ఎస్ఓటీ ఏసీపీ వెంకన్న నాయక్, ఇబ్రహీంపట్నం ఏసీపీ ఉమామహేశ్వరరావు, ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ ఎల్బీనగర్ ఎ. సుధాకర్, ఎస్ఐ ప్రతాప్రెడ్డితో పాటు ఆదిబట్ల పోలీసులు పాల్గొన్నారు.