సిటీబ్యూరో, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ):రాజస్థాన్ నుంచి హెరాయిన్ తెచ్చి ఎన్వలప్ కవర్లలో పెట్టి నగరంలో బైక్ సర్వీస్ ద్వారా సరఫరా చేస్తున్న ముఠాను ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. ఎల్బీనగర్లోని సీపీ క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ వివరాలను వెల్లడించారు. రాజస్థాన్కు చెందిన భన్వర్లాల్, మరో ఇద్దరు జువెనల్స్తో పాటు విష్ణు బిష్ణో ఒక ముఠాగా ఏర్పడ్డారు. వీరంతా చెడు అలవాట్లకు బానిసయ్యారు. డ్రగ్స్కు అలవాటు పడి.. ఆ తరువాత డ్రగ్ విక్రేతలుగా మరారు. రాజస్థాన్లో తెలిసిన వారి వద్ద నుంచి హెరాయిన్ను కొనుగోలు చేస్తున్నారు. కొంత సొంతానికి వాడుకోవడంతో పాటు మరికొంత అవసరమైన వారికి విక్రయిస్తున్నారు. హెరాయిన్ రవాణా చేసేందుకు బైక్ సర్వీస్లను ఉపయోగిస్తున్నారు. విశ్వసనీయ సమాచారంతో ఎల్బీనగర్ ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ సుధాకర్ బృందం మీర్పేటలోని ఎన్బీఆర్ కాలనీలో ఈ నలుగురిని అరెస్టు చేసింది. వారి వద్ద నుంచి రూ. 50 లక్షల విలువైన 80 గ్రాముల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్ సరఫరాకు ఉపయోగిస్తున్న బైక్ సర్వీస్లపై దృష్టి పెట్టామని, ఎన్డీపీఎస్ యాక్టు నమోదైన వారిని బైక్ సర్వీస్లకు ఉపయోగించవద్దని ఆయా బైక్ సర్వీస్ యాప్ నిర్వాహకులకు సూచిస్తామని సీపీ తెలిపారు. ఈ సమావేశంలో ఎస్ఓటీ డీసీపీ మురళీధర్, ఏసీపీ మట్టయ్య తదితరులు పాల్గొన్నారు.
హోటల్ మేనేజర్ సహా మరో వ్యక్తి అరెస్ట్
ఒడిశా నుంచి గంజాయి తెచ్చి నగరంలో విక్రయిస్తున్న ఇద్దరిని వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. డీసీపీ నిఖితా పంత్ కథనం ప్రకారం.. ఒడిశాకు చెందిన సరోజ్కుమార్ దాస్ హైటెక్ సిటీ ప్రాంతంలో ఉన్న ఒరిస్ బార్లో మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులున్నాయి. దీంతో స్నేహితుడైన సయ్యద్ ఫయాజ్తో గంజాయి దందాపై చర్చించాడు. ఒడిశాలో తక్కువ ధరకు గంజాయి తెచ్చి.. నగరంలో విక్రయించేందుకు పథకం వేసి, గంజాయి తీసుకొచ్చారు. బోరబండ ప్రాంతంలో గంజాయి విక్రయిస్తుండగా.. టాస్క్ఫోర్స్ పోలీసులు ఇద్దరిని అరెస్టుచేసి, వారి వద్ద నుంచి 1.7 కిలోల గంజాయి సీజ్ చేశారు. తదుపరి విచారణ నిమిత్తం ఈ కేసును బోరబండ పోలీసులకు అప్పగించారు.