ఘట్కేసర్, జూన్ 12: దివ్యాంగుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ మొదటి నుంచి పెద్ద పీట వేసి ప్రోత్సహిస్తున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. దివ్యాంగుల పెన్షన్ను రూ. 3,116 నుంచి రూ.4,116కు పెంచిన నేపథ్యంలో పోచారం, ఘట్కేసర్, ఘట్కేసర్ మండల పరిధిలోని దివ్యాంగులు సోమవారం పోచారం మున్సిపాలిటీ చైర్మన్ బి.కొండల్రెడ్డి ఆధ్వర్యంలో అన్నోజిగూడ శివాస్ ఫంక్షన్ హాలులో కృతజ్ఞత సభను నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
ఈ కార్యక్రమానికి మంత్రి మల్లారెడ్డి హాజరై మాట్లాడుతూ.. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా దివ్యాంగుల పెన్షన్ మరో వెయ్యి రూపాయలు పెంచడం గొప్ప నిర్ణయమని కొనియాడారు. దివ్యాంగులకు ఇకనుంచి ప్రతినెలా రూ.4,116 పెన్షన్ వస్తుందన్నారు. దళిత బంధు, గృహలక్ష్మి, డబుల్ బెడ్రూం ఇండ్లు, ఇతర అన్ని సంక్షేమ పథకాలు దివ్యాంగులకు లభించే విధంగా సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని మంత్రి అన్నారు. అనంతరం దివ్యాంగులను సన్మానించి, వారితో కలిసి మంత్రి మల్లారెడ్డి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో పోచారం బీఆర్ఎస్ అధ్యక్షుడు మందాడి సురేందర్ రెడ్డి, ఘట్కేసర్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, కమిషనర్ సురేశ్, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, దివ్యాంగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.