హిమాయత్నగర్,మే12 : తాళం వేసిన ఇంట్లోకి గుర్తు తెలియని దుండగులు చొరబడి రూ.20లక్షల నగదును ఎత్తుకెళ్లిన సంఘటన నారాయణగూడ పీస్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ బి.గట్టుమల్లు తెలిపిన వివరాల ప్రకారం.. హిమాయత్నగర్ వీధినెం12లో నగలు వ్యాపారి యోగేష్ కుమార్, అతని భార్య, సోదరుడితో కలిసి నివాసం ఉంటున్నారు. నగలు అవసరమైన వారి ఇంటి వద్దకు వెళ్లి ఆర్డర్ తీసుకుని నగలను తయారు చేసి ఇస్తుంటాడు. బుధవారం ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులంతా బయటకు వెళ్లారు.
తిరిగి అర్ధరాత్రి వచ్చేసరికి ఇంటికి వేసిన తాళం వేసినట్లే ఉన్నప్పటికి గదిలో ఉన్న లాకర్ తెరిచి ఉంది. అనుమానం వచ్చి చూసే సరికి లాకర్లో దాచిన రూ.20లక్షల నగదు కన్పించకపోవడంతో చోరీ జరిగినట్లు గుర్తించి పోలీ సులకు సమాచారం అందించాడు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్ను రప్పించి వేలి ముద్రలు సేకరించారు. బాధితుడు యోగేష్ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.