సిటీబ్యూరో, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): ఒడిశా నుంచి హైదరాబాద్, మహారాష్ట్రకు గంజాయి రవాణా చేస్తున్న డ్రైవర్ను అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి రూ. 2.23 కోట్ల విలువైన 710 కిలోల గంజాయిని మహేశ్వరం జోన్ ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ పోలీసు కమిషనర్ డీఎస్ చౌహాన్ వివరాలను వెల్లడించారు. రాజస్థాన్కు చెందిన సుభాష్ బిష్ణోయ్ డ్రైవర్. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు రాజస్థాన్లోని గంజాయి స్మగ్లర్లతో చేతులు కలిపాడు. ఒడిశా నుంచి హైదరాబాద్, మహారాష్ట్రకు గంజాయిని సరఫరా చేసేందుకు ఒప్పందం చేసుకున్నాడు. ఇందులో భాగంగానే తన లారీలోని క్యాబిన్, బాడీకి మధ్య కొత్తగా మరో క్యాబిన్ను తయారు చేయించాడు. అందులో గంజాయి నింపి.. ఎవరికీ అనుమానం రాకుండా లారీలో తిరుగుతున్నాడు. 24వ తేదీన ఒడిశా నుంచి హైదరాబాద్కు గంజాయితో వస్తున్నట్లు ఎస్ఓటీ మహేశ్వరం ఇన్స్పెక్టర్ రవి బృందానికి సమాచారం అందింది. దీంతో ఘట్కేసర్ పోలీసుల సహకారంతో ఎస్ఓటీ పోలీసులు ఘట్కేసర్లో లారీని ఆపి తనిఖీలు చేశారు. రహస్య క్యాబిన్ నుంచి గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో ఓస్ఓటీ డీసీపీ మురళీధర్, ఏసీపీ మట్టయ్య, ఘట్కేసర్ ఇన్స్పెక్టర్ మహేందర్రెడ్డి, ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ రవి తదితరులు పాల్గొన్నారు.