సిటీబ్యూరో, జనవరి 3 (నమస్తే తెలంగాణ): ఏజెన్సీ ప్రాంతాల నుంచి హాష్ ఆయిల్ తక్కువ ధరకు తెచ్చి హైదరాబాద్, బెంగళూర్లో అధిక ధరలకు విక్రయిస్తున్న ప్రధాన హాష్ ఆయిల్ సరఫరాదారుడితో పాటు మరో ముగ్గురు విక్రేతలను హెచ్న్యూ అరెస్ట్ చేసింది. గంజాయి పండించే రైతులకు ఎక్కువ ధరకు హాష్ ఆయిల్ తయారీకి ఉపయోగించే పెట్రోలియం ఇథనాల్ను అక్రమంగా సరఫరా చేస్తూ, వారి వద్ద నుంచి తక్కువ ధరకు హాష్ ఆయిల్ను కొనుగోలు చేస్తూ సప్లయర్ భారీ నెట్వర్క్ను నిర్వహిస్తున్నాడు. హెచ్న్యూ డీసీపీ చక్రవర్తి గుమ్మి కథనం ప్రకారం.. కుత్బుల్లాపూర్కు చెందిన ఎన్.ప్రవీణ్కుమార్ గంజాయి విక్రేతగా మారాడు. ఇందుకు విశాఖపట్టణం జిల్లాలోని మాడుగుల మండలం, అలాగం గ్రామంలో గంజాయి పండించే రైతులను సంప్రదించాడు. అక్కడ తక్కువ ధరకు గంజాయి కొనుగోలుచేసి హైదరాబాద్, బెంగళూర్లో వినియోగదారులకు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నాడు.
రైతులతో హాష్ ఆయిల్ తయారీకి ఒప్పందం..
ఈ క్రమంలోనే అక్కడ గంజాయి పండించే రైతులతో హాష్ ఆయిల్ తయారు చేయించేందుకు కూడా ఒప్పందం చేసుకున్నాడు. హాష్ ఆయిల్ తయారీకి పెట్రోలియంకు సంబంధించిన ఇథనాల్ అవసరముంటుంది. ఏజెన్సీ ప్రాంతంలో ఇథనాల్ దొరకదు. దీంతో ప్రవీణ్కుమార్ కూకట్పల్లి ప్రశాంతినగర్కు చెందిన నర్మదా ట్రేడర్స్, మహాలక్ష్మి కెమికల్ ట్రేడర్స్లో ఇథనాల్ను కొనుగోలు చేశాడు. ఇక్కడ వంద రూపాయలకు లీటర్ చొప్పున కొనుగోలు చేసి, అక్కడ గంజాయి పండించే గిరిజన రైతులకు రూ. 400లకు విక్రయించాడు. అక్కడ హాష్ ఆయిల్ను లీటర్కు రూ. 30 వేల చొప్పున గిరిజన రైతుల వద్ద నుంచి కొనుగోలుచేసి, దానిని హైదరాబాద్లో రూ.60 వేల నుంచి రూ. 70 వేల వరకు, బెంగళూర్లో రూ. 1.2 లక్షల నుంచి రూ. 1.4 లక్షల వరకు విక్రయించాడు. చిన్న చిన్న డబ్బాలు, ప్యాకెట్లలో ప్యాక్ చేసి హాష్ ఆయిల్ను విక్రయిస్తున్నాడు. ఇప్పటి వరకు ప్రవీణ్ 1400 లీటర్ల హాష్ ఆయిల్ను ఏజెన్సీ ప్రాంతం నుంచి కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.
విక్రయించే స్థాయి నుంచి..
దందా జోరుగా సాగడంతో గంజాయి విక్రయించే స్థాయి నుంచి ప్రస్తుతం ఏజెంట్ల ద్వారా విక్రయించే స్థాయికి ఎదిగాడు. హైదరాబాద్, బెంగళూర్తో పాటు గోవాలో కూడా నెట్వర్క్ను ఏర్పాటు చేసుకున్నాడు. పటాన్చెరువుకు చెందిన పి.మోహన్ యాదవ్, కూకట్పల్లికి చెందిన పి.కళ్యాణ్, బి.సురేశ్ ఏజెంట్లుగా చేరి ప్రవీణ్ వద్ద డ్రగ్ తీసుకొని విక్రయిస్తున్నారు. రెండు రోజుల కిందట చిక్కడపల్లి ప్రాంతంలో ప్రవీణ్ నుంచి ఈ ముగ్గురు హాష్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నారన్న సమాచారంతో హెచ్న్యూ ఇన్స్పెక్టర్ సి.రమేశ్రెడ్డి నేతృత్వంలో ఎస్సై సి.వెంకటరాములు తదితరులు కలిసి ప్రధాన సప్లయర్తో పాటు డ్రగ్ విక్రేతలను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ. 14 లక్షల విలువైన 300 లీటర్ల హాష్ ఆయిల్, 400 లీటర్ల పెట్రోలియం ఇథనాల్, ఇథనాల్ను తరలించేందుకు ఉపయోగించిన ట్రక్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు తదుపరి విచారణను చిక్కడపల్లి పోలీసులకు అప్పగించారు.