సిటీబ్యూరో, జూన్ 9 (నమస్తే తెలంగాణ): ఉస్మానియా యూనివర్సిటీలోని దైరతుల్ మారిఫిల్ ఉస్మానియా విభాగంలో పనిచేసే ఉద్యోగులకు సంబంధించిన జీతం డబ్బులు రూ.1.12 కోట్లు గల్లంతయ్యాయి. ఓయూ అధికారుల ఫిర్యాదు మేరకు ఉస్మానియా యూనివర్సిటీ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ప్రస్తుతం ఈ కేసు సీసీఎస్కు బదిలీ అయ్యింది. పోలీసుల కథనం ప్రకారం.. దైరతుల్ మారిఫిల్ ఉస్మానియా ఉద్యోగులకు జీతాలు రాకపోవడంతో ఆ సంస్థ డైరెక్టర్ అండ్ సెక్రటరీకి ఫిర్యాదు అందింది. విచారణ చేయగా.. 2021-22లో తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేసినట్టు తేలింది. అయినా.. జీతాలు రాకపోవడంతో అధికారులు ఆశ్చర్యపోయారు. దీనిపై శాఖాపరమైన విచారణ నిర్వహించారు. ఆ సంస్థ సూపరింటెండెంట్ సయ్యద్ సయీదుద్దీన్, అకౌంటెంట్ ఎండీ జహీరుద్దీన్ల ఖాతాలను, వారి గూర్చి ఆరా తీయడంతో ఈ ఇద్దరు కలిసి నిధులు దారి మళ్లించినట్లు గుర్తించారు.
సెప్టెంబర్ 29, 2021న జీతాలకు సంబంధించిన బడ్జెట్ను ప్రభుత్వం విడుదల జేయడంతో దైరతుల్ మారిఫిల్కు సంబంధించిన ఖాతాలో డిపాజిట్ అయ్యింది. అయితే, ఈ సొమ్మును అక్టోబర్ 2021 నుంచి డిసెంబర్ 2021 మధ్య కాలంలో నిబంధనలకు విరుద్ధంగా రూ. 1,12,50,000 డ్రా చేసినట్లు గుర్తించారు. మాజీ డైరెక్టర్ (రిటైర్డు) మెహజాబిన్ అక్తర్, సూపరింటెండెంట్, అకౌంటెంట్ కలిసి నిబంధనలకు విరుద్ధంగా డబ్బు డ్రా చేశారని, దీనిపై దర్యాపు జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నతాధికారులు ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు ఈ కేసు దర్యాప్తును సీసీఎస్కు బదిలీ చేశారు. సీసీఎస్ పోలీసులు తాజాగా మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.