ఖైరతాబాద్, ఆగస్టు 1: ప్రజలకు స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు, దాని ఫలాల గురించి వివరించేందుకు దక్షిణ మధ్య రైల్వే ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘ఆజాదీ కా అమృత్’ మహోత్సవ్లో భాగంగా సోమవారం దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో ఆర్పీఎఫ్ సిబ్బంది హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీ వరకు మోటార్ సైకిల్ ర్యాలీకి శ్రీకారం చుట్టారు. ఈ ర్యాలీని పీవీ మార్గ్లోని నెక్లెస్రోడ్ రైల్వే స్టేషన్ ఆవరణలో సౌత్ సెంట్రల్ రైల్వే ఇన్చార్జి జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్, సికింద్రాబాద్, హైదరాబాద్ డీఆర్ఎంలు అభయ్ కుమార్ గుప్తా, శరత్ చంద్రాయన్, ఐజీ (ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్) రాజారామ్ ప్రారంభించారు. అంతకు ముందు జీఎం అరుణ్కుమార్ మాట్లాడుతూ స్వాతంత్య్రోద్యమానికి రైల్వేకు అభినాభావ సంబంధం ఉందన్నారు.
నాడు టెలిఫోన్, మొబైల్ ఫోన్, సరైన కమ్యూనికేషన్ వ్యవస్థ లేని కాలంలో సమాచారం, రవాణాకు ఏకైక మార్గం రైల్వే మాత్రమే ఉండేదని గుర్తు చేశారు. స్వాతంత్య్ర సమరయోధులు సైతం తమ ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్లేందుకు, విస్తరించేందుకు రైలును వినియోగించే వారని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం ‘ఆజాదీ కా అమృత్’ మహోత్సవ్ పేరుతో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నదని, అందులో భాగంగానే ప్రయాణికుల రక్షణలో కీలక భూమిక పోశించే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బందితో స్వాతంత్య్ర ఫలాలను ప్రజలకు వివరిస్తూ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. 11 రోజుల ఈ ప్రయాణంలో 1700 కిలోమీటర్లు ప్రయాణిస్తారని తెలిపారు.