మేడ్చల్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్లో వివిధ పార్టీల నాయకుల చేరికలతో గులాబీ కార్యకర్తలు జోష్లో ఉన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించనప్పటి నుంచి కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి వలసలు ప్రారంభమయ్యాయి. సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ర్టాభివృద్ధిని చూసి వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు స్వాగతిస్తూ బీఆర్ఎస్లో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు మంత్రి మల్లారెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమక్షంలో చేరికలు జోరుగా సాగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించినప్పటి నుంచి ప్రచారం ప్రారంభించారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అమలుతో ప్రజలందరూ అభ్యర్థులకు స్వయంగా మద్దతు ప్రకటిస్తున్నారు.
బీజేపీ, కాంగ్రెస్ల నుంచి బీఆర్ఎస్లోకి రోజురోజుకు చేరికలు పెరుగుతున్నాయి. ఆ పార్టీలు అభ్యర్థులను ఇప్పటి వరకు ప్రకటించకపోవడంతో త్రీవ నిరుత్సాహనికి గురవుతున్న ఆ పార్టీల శ్రేణులు బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు ఆకర్షితులై బీఆర్ఎస్లో చేరేందుకు ముందుకొస్తున్నారు. ఇటీవల మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో జవహర్నగర్ బీజేపీ అధ్యక్షుడు రంగుల శంకర్, మూడుచింతలపల్లి మండల బీజేవైఎం జనరల్ సెక్రటరీ మెగుళ్ల చంద్రకాంత్రెడ్డి, మండల యూత్కాంగ్రెస్ అధ్యక్షుడు నీరజ్గౌడ్, మేడ్చల్ జిల్లా ఎన్ఎస్యూఐ నాయకుడు రాము, యూత్కాంగ్రెస్ మేడ్చల్ మున్సిపల్ నాయకుడు రఘు, సాయికుమార్, కాంగ్రెస్ వార్డు సభ్యుడు ప్రవీణ్ బీఆర్ఎస్లో చేరారు.
మూసాపేట్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కర్కస్వామి, సాయిప్రసాద్, బీజేపీ సీనియర్ నాయకులు శ్రీకాంత్, సాయికిరణ్, సీహెచ్. శాంతికుమార్, మురళి రాజీనామాలు చేసి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ అభివృద్ధికి అహర్నిషలు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కు మద్దతు ఇచ్చేందుకు బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు పేర్కొన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు నాయకులు రాజీనామాలు చేసి ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరుతున్నారు. నియోజకవర్గ దళిత సంఘాల ఐక్యవేదిక ఉపాధ్యక్షుడు, బీజేపీ సీనియర్ నాయకుడు జానయ్యతో పాటు మరి కొందరు బీఆర్ఎస్లో చేరారు. అలాగే కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు మద్దతు తెలుపుతున్నారు. గాజుల రామారం డివిజన్ పరిధిలోని ఒక్షిత్ ఎన్క్లేవ్కు చెందిన దామోదర్ యాదవ్, గోపాల్రెడ్డి, సురపురాజు ఆధ్వర్యంలో కాలనీవాసులు బీఆర్ఎస్కు మద్దతు తెలిపారు. మల్కాజిగిరి, ఉప్పల్ నియోజకవర్గాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరికలు జోరుగా సాగుతున్నాయి.