వెంగళరావునగర్, జనవరి 13: తండ్రి మృతి చెందాడనే బాధ నుంచి తేరుకోకముందే ఇంట్లో చోరీ జరిగిందని తెలియడంతో ఇంటి యాజమాని కుప్పకూలిపోయాడు. వెంగళరావునగర్లో తాళం వేసి ఉన్న ఇంట్లోకి చొరబడి బీరువాలో దాచుకున్న సుమారు 2 కేజీల బంగారం, 4 కేజీల వెండి, రూ.25 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. ఎస్ఆర్ నగర్ పోలీసుల వివరాల ప్రకారం.. ఎర్రగడ్డ డివిజన్ రాజీవ్నగర్ ఎక్స్టెన్షన్లోని శ్రీ సాయి నివాస్ అపార్ట్మెంట్లో 301వ నంబర్ ప్లాట్లో షేర్ల వ్యాపారం నిర్వహించే ఏ వీరచంద్రశేఖర్, ప్రభుత్వ టీచర్ అయిన భార్య లక్ష్మీకుమారి, కూతురు నివాసం ఉంటున్నారు. ఈ నెల 11న వీరచంద్రశేఖర్ తన తండ్రికి అనారోగ్యంగా ఉన్నదని తెలియడంతో స్వగ్రామమైన ఏపీలోని ప్రకాశం జిల్లా జే పంగులూరుకు బయలుదేరారు. మార్గమధ్యంలో ఉండగానే తండ్రి మరణించినట్టు సమాచారం అందడంతో భార్య, కుమార్తె కూడా వెళ్లారు. అదే రోజు రాత్రి ఇంట్లోకి చొరబడ్డ దొంగలు బీరువాలో దాచిన 2 కేజీల బంగారు ఆభరణాలు, 4 కేజీల వెండి వస్తువులతోపాటు ఇటీవల శంషాబాద్ సమీపంలో ఓ ప్లాట్ విక్రయించగా వచ్చిన డబ్బు రూ.25 లక్షలు కూడా దోచుకెళ్లారు.
వీర చంద్రశేఖర్ మిత్రుడు తన బిడ్డ వివాహం కోసం భద్రపర్చమని ఇచ్చిన అరకేజీ బంగారు ఆభరణాలు, రూ.35 లక్షల నగదును ఓ సంచిలో చుట్టి బుట్టలో పెట్టడంతో దొంగలు గుర్తించలేకపోయారు. మరో బంగారు వడ్డాణం కూడా కూరగాయల సంచిలో పెట్టి బీరువాలో దాచడంతో దొంగలకు కనబడలేదు. గురువారం తెల్లవారుజామున ఫ్లాట్ తలుపు తీసి ఉండటంతో పక్కఫ్లాట్ వారు చంద్రశేఖర్తోపాటు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి పశ్చిమ మండలం డీసీపీ జోయల్ డేవిస్, అడిషనల్ డీసీపీ ఇక్బాల్ సిద్ధిఖీ, ఏసీపీ గణేశ్, ఇన్స్పెక్టర్ సైదులు చోరీ విధానాన్ని పరిశీలించారు. క్లూస్ టీం వచ్చి వేలి ముద్రల ఆధారాలను సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ సైదులు తెలిపారు.