మెహిదీపట్నం, ఏప్రిల్ 19 : ఇఫ్తార్ విందుకు వెళ్లి వచ్చేసరికి ఇంట్లో దొంగలు పడి బంగారు ఆభరణాలను దోచుకెళ్లిన సంఘటన లంగర్హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… లంగర్హౌస్ నానల్నగర్ సాలార్జంగ్ కాలనీలో నివాసముండే మాజీద్ తన కుటుంబసభ్యులతో కలిసి మంగళవారం రాత్రి ఆసిఫ్నగర్ దత్తాత్రేయనగర్ కాలనీలో నివాసముండే తన బంధువుల ఇంటికి ఇఫ్తార్ విందుకు వెళ్లారు.
బుధవారం తెల్లవారుజామున 1:30 గంటలకు తిరిగి ఇంటికి వచ్చారు. ఇంటి తలుపులు తీసి లోపలికి వెళ్లగా, బెడ్రూంలో బీరువా తెరిచి ఉండగా.. బంగారు ఆభరణాలు కనిపించలేదు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు. బీరువాలో దాచిన 50 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.