రైస్ ఏటీఎంకు 750 రోజులు పూర్తి
కరోనా ఆపత్కాలంలో విశేష సేవలు
మన్సూరాబాద్, ఏప్రిల్ 30 : కరోనా ఆపత్కాలంలో నిరాశ్రయులైన వారికి, నిరుపేదలకు ఆపన్నహస్తం అందించేందుకు సామాజిక కార్యకర్త దోసపాటి రాము నాగోలు డివిజన్ పరిధి రాక్హిల్స్కాలనీలో రైస్ ఏటీఎం ప్రారంభించి శనివారానికి 750 రోజులు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సుమారు 50 మందికి నిత్యావసర సరుకులతోపాటు జీవనోపాధి అవకాశం కల్పించారు. పలువురికి టిఫిన్ సెంటర్ల సామగ్రి, కుట్టుమిషన్లు, తోపుడుబండ్లు, పిండి గిర్నీలు అందజేశారు.
లాక్డౌన్ వల్ల చాలామంది చిరువ్యాపారులు, కూలీలు, గుమస్తాలు ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వీరికి సాయమందించేందుకు ఏప్రిల్ 13, 2020న దోసపాటి రాము రైస్ ఏటీఎం ప్రారంభించి బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులు అందజేశారు. నాటి నుంచి నేటివరకు ప్రాజెక్ట్ ప్రిషా సహకారంతో వెయ్యి కుటుంబాలకు ఉపాధి కల్పించారు.